విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున అన్నారు. సోమవారం మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతులకు పింఛన్లు ఒక ఆర్థిక భరోసా మాత్రమే కాకుండా వారి జీవితాల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపే సంక్షేమ పథకం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడం తమ బాధ్యత అని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజు, అయ్యప్ప, తిక్కన్న, గంగయ్య, బడేసాహేబ్, సచివాలయ సిబ్బంది తులసి తదితరులు పాల్గొన్నారు.


