— ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని
విశాలాంధ్ర – కడియం : పారిశ్రామిక అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కాకినాడ ఏపీఐఐసీసీ ప్రాంతీయ కార్యాలయం నాలుగవ జోన్ కలయికతో మరింత పరిధి పెంచుకుంటుందని ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం కాకినాడ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు పోలవరం జిల్లా కూడా కాకినాడ ప్రాంతీయ కార్యాలయంలో కలవడంతో పరిధి విస్తరించిందని పేర్కొన్నారు. అన్ని వనరులు అందుబాటులో ఉన్న గోదావరి జిల్లాల్లో పారిశ్రామిక పురోగతి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు సమస్యలను చైర్మన్ మంతెనతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళి, పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామన్నారు. రాజానగరం నియోజవర్గంలో కలవచర్ల వద్ద ఏపీఐఐసీ పారిశ్రామికవాడ అభివృద్ధికి ప్రయత్నిస్తున్నామన్నారు. కాకినాడ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడాన్ని గమనించిన ఆయన నూతన కార్యాలయ నిర్మాణానికి హామీ ఇచ్చారు. మంగళగిరిలో జరగబోయే రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.


