విశాలాంధ్ర-రాప్తాడు, మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న రామినేపల్లి గ్రామ సర్కిల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనగానపల్లి మండలానికి చెందిన రంజిత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. కనగానపల్లికి చెందిన రంజిత్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రామినేపల్లి సర్కిల్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంజిత్ తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన 108 పైలట్ రాము, ఈఎంటీ దాదు బాషా సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని తక్షణమే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు.
ఘటన జరిగిన వెంటనే రాప్తాడు సీఐ సి. వెంకటేశులు ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి అకాల మరణంతో స్వగ్రామమైన కనగానపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.


