ఐరాస పర్యవేక్షణకు అనుమతివ్వం: ఇరాన్
తెహ్రాన్: యుద్ధానికి ముందున్న పరిస్థితి తిరిగి నెలకొంటాయని భావిస్తే పొరపడుతున్నట్టే అని అమెరికానుద్దేశించి ఇరాన్ వ్యాఖ్యానించింది. గతంలో ఉన్నట్లుగానే హోర్మూజ్ జల సంధి గుండా ప్రయాణాలు సాగుతాయని, ముందున్న పరిస్థితులు తిరిగి వస్తాయన్న ఆలోచన మానుకోవాలని, ఆ రోజులు మళ్లీ రావని ఇరాన్ పార్లమెంటరీ స్పాకర్ మహమ్మద్ ఘలీబాఫ్ స్పష్టంచేశారు. హోర్మూజ్ నిర్వహణ బాధ్యత ఇరాన్దేనని తేల్చిచెప్పారు. అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేసిన అణు క్షేత్రాý పర్యవేక్షణ కోసం ఐక్యరాజ్య సమితి అధికారులకు అనుమతి ఇచ్చేది లేదని పేర్కొంది. స్విట్జర్లాండ్లో తొలి విడత చర్చలు ముగిసిన క్రమంలో ఇరాన్ మంగళవారం ఈ ప్రకటన చేసింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ఇన్స్పెక్టర్లను ఆహ్వానించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్తో ఇప్పటివరకు సమావేశం కాలేదని, అమెరికాఇజ్రాయిల్ దాడుల్లో ధ్వంసమైన క్షేత్రాల పర్యవేక్షణకు వారిని ఆహ్వానించే ఆలోచన లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఖేయీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం జరగలేదని ఐరాసకు ఇరాన్ రాయబారి అలీ బహ్రెయినీ కూడా చెప్పారు. స్విట్జర్లాండ్ చర్చలు ముగిసిన నేపథ్యంలో ఘలిబాఫ్ మాట్లాడుతూ అమెరికాను ఎప్పటికీ నమ్మబోమన్నారు. భవిష్యత్లోనూ నమ్మకపోవడమే ఇరాన్కు మంచిదని చెప్పారు. ఫ్రీజ్ చేసిన 12 బిలియన్ డాలర్ల ఆస్తులు విడుదల చేయడానికి అమెరికాఇరాన్ మధ్య ప్రాథమికంగా ఒప్పందం కుదిరిందన్నారు. సోయా, మొక్కజొన్న, గోదుమలు కొనేందుకు ఇరాన్ అంగీకరిస్తే…ఆస్తులు విడుదల చేసేందుకు అమెరికా సిద్ధమైనట్లు సమాచారం. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ఒమన్ పేర్కొంది. 60 రోజుల్లో తుది ఒప్పందం చేసుకునేలా అంగీకరించినట్లు తెలిపింది. లెబనాన్లో సైనిక కార్యకలాపాలు ముగించాలని, హోర్మూజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి రెండు వర్గాలు అంగీకరించాయి. అలాగే ప్రత్యక్ష కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్ణయించాయి. స్విట్జర్లాండ్ చర్చýతో అనేక అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వేర్వేరుగా ప్రకటించారు. చమురు ఎగుమతులపై ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలలో ప్రాథమికంగా నిర్ణయాలు జరిగినట్లు వెల్లడించారు.


