ఇస్లామాబాద్/తెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మంగళవారం పాకిస్థాన్లో పర్యటించారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయన మొదటి దేశాన్ని విదేశాలకు వెళ్లారు. ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పెజెష్కియాన్కు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు అనేక మంది మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. ఇరాన్ అధ్యక్షడి వెంట కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఉన్నది. ఇరాన్కు సంఘీభావం, ప్రాదేశిక ఉద్రిక్తతలు తగ్గించేందుకు సహకరించడం, శాంతిసుస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నించడం కోసం పాకిస్థాన్ చేసిన కృషికిగాను కృతజ్ఞతలు తెలుపడమే పెజెష్కియాన్ పర్యటన ఉద్దేశంగా ఇస్లామాబాద్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలను నాయకులు సమీక్షిస్తారని, రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవడమే కాకుండా దౌత్య బంధాన్ని మరింతగా బలపర్చుకునే దిశగా చర్చిస్తారని దౌత్య కార్యాలయం తెలిపింది. కాగా, జర్దారీ, షరీఫ్తో పెజెష్కియాన్ సమావేశాలు నిర్వహిస్తారని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తోనూ ఆయన భేటీ అవుతారని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. వాణిజ్యం, ఇంధనం, సహకారం, సరిహద్దు భద్రత, ప్రాదేశిక అనుసంధానం, రెండు దేశాల ప్రజల మధ్య అనుబంధం తదితర అనేక అంశాలపై నాయకులు చర్చిస్తారని వెల్లడించింది. పెజెష్కియాన్ చివరగా గత ఆగస్టులో పాకిస్థాన్లో పర్యటించారు.


