క్రాకోచ్‌ జనతా పార్టీ నిరసనపై పిల్..తక్షణ విచారణకు ఢిల్లీ హైకోర్టు నో


దేశరాజధాని న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమం అదుపు తప్పకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌పై తక్షణ విచారణకు హైకోర్టు నిరాకరించింది. జూన్ 6న కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సేవ్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.

కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం నేపథ్యంలో పబ్లిక్ ఆర్డర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సేవ్ ఇండియా ఫౌండేషన్ ఈ పిల్‌ను దాఖలు చేసింది. ఈ మేరకు పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. ప్రజల మౌలికవసతుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పింది.

నిరసన చేపట్టేందుకు కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఎత్తున ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తోందని సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. భారీ ఎత్తున యువత పాల్గొనేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. ఈ దిశగా ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న కంటెంట్‌లో రెచ్చగొట్టే సందేశాలు ఉన్నాయని తెలిపింది. భద్రతా దళాలను అడ్డుకోవడం వంటి సందేశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. భారీ ఎత్తున జనాలు హాజరు కావాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పకుండా ముందస్తు చర్యలు అవసరమని పేర్కొంది. ట్రాఫిక్, ప్రజాభద్రతకు ఇబ్బంది లేకుండా ఢిల్లీలో ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ఈ విషయాలపై ఇప్పటికే ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను సంప్రదించినా ఇప్పటివరకూ ఎలాంటి మార్గదర్శకాలు జారీ కాలేదని తెలిపింది. చివరకు కోర్టును ఆశ్రయించినట్టు తెలిపింది. అయితే, న్యాయస్థానం మాత్రం ఈ పిటిషన్‌పై తక్షణ విచారణకు నిరాకరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *