

- కమ్యూనిజం లేని భారత్ లేదు
- అభ్యుదయ రచనలతో ప్రజల్లో చైతన్యం
- మూఢత్వం లేని సమాజం అరసం లక్ష్యం
అరసం మహాసభల్లో వక్తలు
తిరుపతి : ప్రగతిశీల శక్తులు, వామపక్ష వాదులు తమ ఎజెండాలను పక్కనపెట్టి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తేనే దేశంలో ఫాసిస్ట్ శక్తులను కట్టడి చేయవచ్చునని ప్రజాస్వామ్య రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో ఉదయం అరసం జెండాను రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ పి సంజీవమ్మ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభలో డాక్టర్ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ ఫాసిజానికి వ్యతిరేకంగా కమ్యూనిజం ను సుస్థిర పరచేందుకు అరసం ఏర్పడింది అన్నారు. నాటి నుండి రచయితలు చేసిన అనేక రచనలు సమాజం లో చైతన్యం తీసుకు వచ్చాయని అన్నారు. నేడు ప్రగతి శీల శక్తులు అనైక్యంగా ఉన్నాయని, ఫాసిస్టు శక్తులు మాత్రమే ఐక్యంగా ఉన్నాయని తెలిపారు . ఈ ధోరణి దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రగతి శీల శక్తులకు ఎవరి ఎజెండాలు వారికి ఉన్నా, ఐక్య కార్యాచరణను బలంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. మార్క్సిస్టు దృక్పథంతో పని చేస్తున్న వారు అసమానతలు లేని, మూఢత్వం లేని సమాజం కోసం కలిసి పోరాటం సాగించాలి అని చెప్పారు. నేడు మతం సమాజాన్ని నడిపించే దారుణ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. అభ్యుదయ ఉద్యమాల్లో అస్తిత్వం ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని,
ఐక్య వామపక్ష ఉద్యమాలు బలపడితే దేశాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. ప్రశ్నించే వారిపై అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేసి, కేసులు పెట్టడాన్ని విమర్శించారు. అదే రాముడిని కొలిచే వాడిని దేశ భక్తుడిగా కీర్తిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో లౌకిక, ప్రజాస్వామ్య, వామ పక్ష వాదులు ఏక తాటి పైకి వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సభాధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయమైన భారతదేశం ఏర్పడుతుందని సంఘసంస్కరణ ఉద్యమం నిరూపించిందని అన్నారు. విచ్చలవిడి తనంతో అసమానతలు పెరిగి , దోపిడి దారులు ఎక్కువ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు ప్రజాస్వామ్యం అని, అధికారం లోకి వచ్చాక తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరచి లేనివి ముందుకు తీసుకొస్తారని, నిర్లిప్తంగా ఉండకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడేందుకు ప్రగతి శీల శక్తులు ఐక్య కార్యాచరణ తో ముందుకు వెళ్లాలని అన్నారు.అరసం తెలంగాణ నాయకులు వేల్పుల నారాయణ మాట్లాడుతూ అస్తిత్వ ఉద్యమాల సంఖ్య పెరుగుతోందని, కులాల పరంగా, మతాల పరంగా రచయితల సాహితీ సంఘాలు ఏర్పడుతుండటం ప్రమాదకరంగా మారుతోందని అన్నారు. మతాల పరంగా రచనలు చేసి సోషల్ మీడియాలో రెచ్చ గొడుతున్నారని విమర్శించారు. విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు హాజరై అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్మిక ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలునిచ్చారని గుర్తు చేశారు. నేడు అరసం మహాసభల్లో కూడా రచయితల ఐక్యత అనివార్యం అని తీర్మానాలు చేయడం శుభ పరిణామం అన్నారు. సమాజం ఏమౌతుందో అన్న ఆవేదన ప్రతిఒక్కరి లో ఉంది అని పేర్కొంటూ, అరసం నాయకత్వం వహించి అభ్యుదయ భావజాలం తో రచనలు చేస్తున్న అందరినీ ఒక గొడుగు కిందకు తీసుకొని రావాలి అని కోరారు. విద్యార్థులు, యువత లో చైతన్యం తీసుకొచ్చేందుకు అరసం చేసే కృషికి విశాలాంధ్ర సహకారం అందిస్తుందని తెలిపారు. విరసం రాష్ట్ర బాధ్యులు బాబ్జీ మాట్లాడుతూ అనేక నిర్బంధాలు, ఆటుపోట్లను ఎదుర్కొని రచనలు చేయడం అంత సులభం కాదని అన్నారు. కాలానికి మరింత పదును పెట్టాల్సిన నేపథ్యం నేడు దేశం లో నెలకొందని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు నేటి పాలకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మతాన్ని ప్రజల పై రుద్దుతోన్న పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లే రచయితలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అరసం కు విరసం తరపున సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ తొమ్మిది దశాబ్దాలుగా అరసం ఆధ్వర్యం లో అనేక రచనలు చేసి సమాజం లో చైతన్యం తీసుకొచ్చేందుకు రచయితలు కృషి చేశారని అన్నారు. అభ్యుదయ వేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సాకం నాగరాజు స్వాగత ఉపన్యాసం చేస్తూ వామ పక్ష భావజాలానికి కాలం చెల్లింది అనే వారికి తగిన సమాధానం చెప్పాలని అన్నారు. కమ్యునిజం లేని భారత దేశం లేదని పేర్కొన్నారు. ఈ మహాసభలు అభ్యుదయ రచనలకు మరింత ఊతం ఇవ్వనున్నట్లు తెలిపారు. అరసం ప్రత్యేక సంచికగా తీసుకొచ్చిన విశాలాక్షి మాస పత్రికను సాకం నాగరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వేదిక పైకి అతిథులకు గంటా మోహన్ స్వాగతం పలికారు. వల్లూరి శివకుమార్ గత మహాసభల నుండి ఈ మహాసభల వరకు మృతి చెందిన రచయితలకు వల్లూరి శివ ప్రసాద్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ మహాసభల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజానాట్య మండలి కళాకారులు చిన్నం పెంచలయ్య, నాగరాజు, చారులత, గుర్రప్ప లు ఆలపించిన ఉద్యమ గేయాలు అక్కట్టుకున్నాయి.


