ఏయూ శతాబ్ది వేడుకల్లో సీఎం సందేశం.. యువత ఉద్యోగాలు ఇవ్వగల స్థాయికి ఎదగాలి..! Andhra University centenary celebrations | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్‌వర్క్ సెంటర్ ప్రారంభం, 500 కోట్లు ప్రకటించి ఏయూను టాప్ ర్యాంక్ లక్ష్యంగా చెప్పారు

News18
News18

విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. యూనివర్సిటీలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆయన స్పష్టం చేశారు. జాతీయ ఆస్తులుగా భావించే యూనివర్సిటీలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఈ సందర్భంగా రూ.64 కోట్లతో నిర్మించిన ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్‌వర్క్ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. అలాగే మరో రూ.112 కోట్లతో చేపట్టనున్న తొమ్మిది అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లు, కాన్వకేషన్ హాల్ సహా పలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నాంది పలికారు.

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం, మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనా విధానం కూడా మారాలని సూచించారు. నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్స్‌పై దృష్టి పెట్టి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడడం కాకుండా, మరికొంత మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు. ఈ దిశగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ఏయూ శతాబ్ది వేడుకలను చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్న సీఎం, విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడం మరో విశేషమని అన్నారు. భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రావడం విశాఖ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే 58 దేశాల విద్యార్థులు ఏయూలో చదువుకుంటుండటం గర్వకారణమని అన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ నిధులతో యూనివర్సిటీని దేశంలో టాప్-5లో, ప్రపంచంలో టాప్-100లో నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులు ముందుకు వస్తే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏయూ వంటి విద్యాసంస్థలు భావితరాల నాయకులను తయారు చేయాలని, ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ రాబోయే కాలంలో మరిన్ని విజయాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సమిష్టి కృషితో ఏయూ కొత్త శిఖరాలను అధిరోహించనుందని తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *