ఎండిపోతున్న చెరువులకు ఊపిరి.. భారీ స్థాయిలో పూడిక తొలగింపు పనులు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు Sumit Kumar నేతృత్వంలో 1500 పనులు, ప్రతి మూడు చెరువులకు టెక్నికల్ అసిస్టెంట్, రాష్ట్రవ్యాప్తంగా జలధార ప్రాజెక్టు వేగవంతం, నీటి సంరక్షణపై దృష్టి

News18
News18

చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు భారీ స్థాయిలో చర్యలు చేపడుతున్నామని, ప్రతి మూడు చెరువులకు ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను ప్రత్యేకంగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ Sumit Kumar వెల్లడించారు. ఫీడర్ కాలువల్లో పూడిక తొలగింపు, చెరువులను సమీప వాగులతో అనుసంధానం చేయడం, తూములకు మరమ్మతులు చేపట్టడం వంటి పనులను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అమరావతి నుంచి ‘జలధార – జలహారతి’ కార్యక్రమంపై జలవనరుల శాఖ కార్యదర్శి Shashibhushan Kumar వివిధ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిస్థితులపై కలెక్టర్ సమిత్ కుమార్ వివరాలు వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ‘జలధార’ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. జలవనరుల శాఖ పరిధిలోని 38,599 చెరువులు, మున్సిపల్ శాఖ పరిధిలోని 194 నీటి వనరులు, అటవీ శాఖ ఆధ్వర్యంలోని 474 చెరువులు, అలాగే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న సుమారు 6 లక్షల 77 వేల పైచిలుకు ఇంకుడు గుంతల నిర్వహణను సమగ్ర ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. నీటి సంరక్షణ, నిల్వ సామర్థ్యాల పెంపు, భూగర్భ జలాల పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

అనంతరం జిల్లా పరిస్థితులపై కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో 50 శాతం కంటే తక్కువ నీటి మట్టం ఉన్న చెరువులను ప్రాధాన్యతగా గుర్తించి అవి పూర్తిగా నిండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితులు, భౌగోళిక పరిమితులు, ఫీడర్ కాలువల దెబ్బతినడం వంటి కారణాలతో అనేక చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయని చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లావ్యాప్తంగా సుమారు 1,500 పనులను గుర్తించినట్లు వెల్లడించారు. భారీ మూలధన వ్యయం అవసరం లేని పనులకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, మిగిలిన పనులకు అవసరమైన నిధులు మరియు పరిపాలనా అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామస్థాయి సిబ్బందికి చెరువుల బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్‌కు రెండు నుంచి మూడు చెరువులను కేటాయించి, చెరువులకు అనుసంధానమైన ఫీల్డ్ చానెల్‌ల శుభ్రపరిచే పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమాన్ని పూర్తిగా చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వల పెంపు దిశగా మళ్లించినట్లు వివరించారు. అవసరమైన చోట్ల యంత్రాంగం, సాంకేతిక సహకారం అందించేందుకు సాగునీటి శాఖతో సమన్వయం కొనసాగుతోందన్నారు.

గత 40 రోజులుగా 50 శాతం కంటే తక్కువ నీటి మట్టం ఉన్న చెరువులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, ఈ సందర్భంగా మరో 600 చెరువులకు అభివృద్ధి పనులు అవసరమని గుర్తించినట్లు తెలిపారు. పనులు అవసరం లేని చెరువులను యథాతథంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. గ్రామాల వారీగా చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్‌సీ వెంకటేశ్వరరాజు, జలవనరుల శాఖ డీడీ తదితర అధికారులు పాల్గొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *