Last Updated:
RTI Online: మీరు సమాచార హక్కు చట్టం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్త విధానం వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం (RTI) అమలును పూర్తిగా డిజిటల్ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 25 జారీ చేసింది. RTI Request & Appeals Management Information System (RTIMIS) అనే కొత్త ఆన్లైన్ ప్లాట్ఫాంని ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త IT ఫీచర్లను అమలు చేస్తూ ఈ వ్యవస్థను మొదలుపెట్టింది ప్రభుత్వం.
ఈ ఆన్లైన్ విధానం 2026 ఫిబ్రవరి 18న అమల్లోకి వచ్చింది. ఇది పూర్తిగా ఆన్లైన్ కిందకు వచ్చింది. అంటే.. అప్లికేషన్ పెట్టుకోవడం మొదలు.. సమాచారం పొందడం వరకూ.. అంతా ఆన్లైన్లో అయిపోతుంది. దీని కోసం ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే.. ఆధికారిక వెబ్సైట్ https://rtionline.ap.gov.in కి వెళ్లవచ్చు.
ప్రధాన సౌకర్యాలు:
ఈ కొత్త విధానం వల్ల ఇంటి నుంచే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా RTI దరఖాస్తు దాఖలు చేయవచ్చు. అలాగే.. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేషన్ ఫీజును కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. SMS, ఈమెయిల్ ద్వారా రియల్-టైమ్ అప్డేట్స్ పొందవచ్చు. అలాగే స్టేటస్ ట్రాకింగ్ చేయవచ్చు. అప్లికేషన్ పెట్టుకున్న 30 రోజుల్లో సమాధానాన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) ఇవ్వాలి. ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే మరోసారి పరిశీలించమని ఫస్ట్ అప్పీల్ చెయ్యవచ్చు. ఆ తర్వాత ఇచ్చిన సమాచారం కూడా సంతృప్తిగా లేకపోతే.. సెకండ్ అప్పీల్ కూడా చెయ్యవచ్చు. ఇలా 2 అప్పీల్స్ వరకూ.. ఆన్లైన్లో చెయ్యవచ్చు. అప్పటికీ సంతృప్తి కలగకపోతే, అప్పుడు ఆఫీసుకి వెళ్లవచ్చు.
దరఖాస్తు చేసిన తర్వాత.. జిల్లా నోడల్ ఆఫీసర్ 5 రోజుల్లో దరఖాస్తు సంబంధిత PIOకి దాన్ని ఫార్వర్డ్ చేయాలి. PIO దాన్ని 30 రోజుల్లో పరిశీలించి సమాచారం ఇవ్వాలి. మొదటి అప్పీల్ని 30 రోజుల్లో పెట్టుకోవాలి. సెకండ్ అప్పీల్ని 90 రోజుల్లో ఇవ్వాలి.
ఈ కొత్త వ్యవస్థతో పౌరులు కాగితాలు, పోస్ట్ ఆఫీస్ లేదా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే RTI దరఖాస్తు చేసి, ట్రాక్ చేసుకుని, అప్పీల్ వరకు పూర్తి చేయవచ్చు. ఇది ప్రజల సమాచార హక్కును మరింత సులభం, వేగవంతం, పారదర్శకం చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న మాన్యువల్ పద్ధతిలో కనిపించిన ఆలస్యం, ఖర్చు, కాగితాల సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. అలాగే.. ఆన్లైన్ కారణంగా.. వీలైనన్ని ఎక్కువ దరఖాస్తులు వెంటవెంటనే పెట్టుకునేందుకు వీలవుతుంది. అందువల్ల వివిధ అంశాలపై రీసెర్చ్ చేసేవారికి.. ఇది బాగా ఉపయోగపడుతుంది. వారు ఇంటి నుంచే కావాల్సిన సమాచారం మొత్తం పొందగలుగుతారు.
మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ & దరఖాస్తు కోసం వెంటనే https://rtionline.ap.gov.in సైట్ను సందర్శించండి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



