వాషింగ్టన్: పాకిస్థాన్లో మీడియాకు స్వేచ్ఛ లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. అందువల్లే ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేయడంలో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. అమెరికా-ఇరాన్ డీల్కు ఖతార్తో కలిసి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 15న మధ్యంతర శాంతి ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించగా…రెండు రోజుల తర్వాత ఈ ఒప్పందం అధికారిక పత్రం విడుదలైంది. పాకిస్థాన్, ఖతార్లో పత్రికా స్వేచ్ఛ సరిగ్గా లేకపోవడం, పారదర్శకతపై ఉన్న ఆందోళనల కారణంగానే వివరాలను విడుదల చేయడానికి వాషింగ్టన్ సమయం తీసుకుందని వాన్స్ పేర్కొన్నారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛకు భంగం కలిగించే చట్టాలను ప్రభుత్వం అమలు చేయడాన్ని అమెరికా రాజ్యాంగం నిషేధిస్తుందని జేడీ వాన్స్ తెలిపారు. పాక్లో అటువంటి రాజ్యాంగపరమైన రక్షణలు లేకపోవడంతోనే ఈ ఆలస్యం జరిగిందన్నారు. ఇరాన్తో చేసుకున్న ఒప్పందంలో ఆ దేశానికి గణనీయమైన రాయితీలు ఇచ్చే అవకాశం ఉన్నందున…అమెరికా అవగాహన ఒప్పందం వివరాలను గోప్యంగా ఉంచుతోందని వస్తున్న విమర్శలను వాన్స్ తోసిపుచ్చారు.


