భారత క్రికెట్లో ఓ యువ సంచలనం సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ, ఏకంగా భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత టీ20 జట్లలోనూ అతడికి స్థానం లభించింది. దీంతో భారత పురుషుల సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.
ఈ సందర్భంగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించాడు. యువ క్రికెటర్గా వైభవ్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడని కొనియాడాడు.
“ఒక యువ ఆటగాడి గురించి ఏం చెప్పగలం? అతడు ఏం చేయగలడో మీరంతా చూశారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో కూడా దాదాపు ఒంటిచేత్తో రాజస్థాన్ రాయల్స్ను నడిపించాడు. అతని బ్యాటింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లోనే కాదు, గత సీజన్లోనూ అద్భుతంగా ఆడాడు. ఐపీఎల్ లాంటి అత్యంత పోటీ, ఒత్తిడి ఉండే టోర్నమెంట్లో అతడు ఎంతో విధ్వంసకరంగా ఆడాడు. గేమ్ ఛేంజర్గా మారాడు. క్రికెట్ను, ముఖ్యంగా టీ20 ఫార్మాట్ను చూసేవారికి అతనిపై భారీ అంచనాలున్నాయి. వాస్తవానికి అతడు తన ప్రదర్శనతోనే జట్టులో చోటు దక్కించుకున్నాడు” అని అగార్కర్ వివరించాడు.
The post టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. appeared first on Visalaandhra.


