బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో కొత్త పార్టీపై జోరుగా ప్రచారం


తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అన్నామలై పేరు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.కోయంబత్తూరులో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పోస్టర్లు,అలాగే అభిమాన సంఘం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తున్నాయి.మరోవైపు బీజేపీ కీలక సమావేశాలకు ఆయన దూరంగా ఉండటం కూడా రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలకు తావిస్తోంది.

కోయంబత్తూరులో పోస్టర్ల హడావిడి
ప్రస్తుతం కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర కేంద్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
అయితే ఈ సమావేశాలకు అన్నామలై హాజరుకాకుండా విదేశీ పర్యటనలో ఉన్నారు.
ఇదే సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయనకు మద్దతుగా భారీ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.
ఁభయం లేని మనసులకు హద్దులు ఉండవుఁ అనే సందేశంతో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.
అదే సమయంలో ఆయన అభిమాన సంఘం ఃఅన్నామలై అన్బు కూట్టంః రాష్ట్రవ్యాప్తంగా కొత్త సభ్యులను చేర్చుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.
దీంతో కొత్త రాజకీయ వేదిక ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయా అనే చర్చ మొదలైంది.

త్రిభాషా విధానంపై కేంద్రంతో విభేదాలు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన త్రిభాషా విధానంపై అన్నామలై బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.సీబీఎస్ఈ 9వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే మూడు భాషలను తప్పనిసరి చేస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నిర్ణయం తమిళనాడు విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో నిర్ణయించిన ప్రకారం 2029-30 విద్యా సంవత్సరం నుంచి మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర నాయకత్వానికి సూచించారు.ఈ భాషా విధానంపై ఏర్పడిన విభేదాలే ఆయన భవిష్యత్ రాజకీయ నిర్ణయాలకు కారణమయ్యాయనే ప్రచారం కూడా సాగుతోంది.

ఏఐఏడీఎంకేతో విభేదాల ప్రభావం?
అన్నామలై 2021 నుంచి 2025 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఈ కాలంలో ద్రవిడ ఉద్యమ ప్రముఖులు సి.ఎన్. అన్నాదురై, జయలలితలపై ఆయన చేసిన వ్యాఖ్యలు మిత్రపక్షమైన ఏఐఏడీఎంకేలో అసంతృప్తికి దారితీశాయి.అన్నామలై వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ పార్టీ నాయకత్వం, ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.అనంతరం ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవికి దూరమైన విషయం తెలిసిందే.అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలపై ఆయనలో అసంతృప్తి కొనసాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కార్తీ చిదంబరం వ్యాఖ్యలతో పెరిగిన ఆసక్తి
ఈ రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన సోషల్ మీడియా పోస్ట్ మరింత చర్చకు దారితీసింది.తమిళనాడులో త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందని ఆయన పేర్కొన్నారు.అలాగే ఆ పార్టీ పేరుకు సంబంధించిన ఆసక్తికర అంశం కూడా ఉందంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చారు.అయితే కొత్త పార్టీ అంశంపై అన్నామలై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, ఆయన అనుచరుల కార్యకలాపాలు చూస్తే త్వరలోనే కీలక రాజకీయ ప్రకటన వెలువడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *