విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- గంజాయి రహిత సమాజం నిర్మాణమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ వ్యవస్థను కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన వ్యసనాలని అన్నారు. నువ్వు ఎంచుకునే అలవాటు నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మంచి అలవాట్లు విజయానికి దారి చూపిస్తే, గంజాయి వంటి మత్తు పదార్థాల అలవాట్లు జీవితాన్ని చీకట్లోకి నెడతాయిఅని పేర్కొన్నారు. గంజాయి వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వ్యక్తి ఆలోచనా విధానం, నిర్ణయ సామర్థ్యం, జీవన విధానంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. మత్తుకు బానిసైన వ్యక్తులు తమ లక్ష్యాలను కోల్పోయి జీవితంలో వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. గంజాయి కారణంగా కుటుంబాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు పెరుగుతున్నాయని చెప్పారు. ఒక్క వ్యక్తి తీసుకునే తప్పు నిర్ణయం అతని జీవితాన్నే కాకుండా కుటుంబ సభ్యుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. అందుకే ఁఒక్క నిర్ణయం రెండు జీవితాలను ప్రభావితం చేస్తుందిఁ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గంజాయికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, యువత తమ భవిష్యత్తును నిర్మించుకునే దిశగా అడుగులు వేయాలని సీఐ కౌలుట్లయ్య పిలుపునిచ్చారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.


