న్యూదిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక చేశారు. అవసరమైతే ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత సైనిక బలగాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. భూతల, గగన, సముద్రంలో అత్యాధునిక రీతుల్లో పోరాటానికి త్రివిద దళాలు సామర్థ్యం పెంచుకుంటున్నట్టు తెలిపారు. పుణెలో శనివారం జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) 150వ పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శాంతి తాత్కాలికమేనని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ సెకెండ్ ఫేజ్కు కూడా త్రివిధ దళాలు పట్టుదలగా సర్వసన్నద్ధమవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో జరుగబోయే యుద్ధాలు కేవలం భూమి, సుముద్రం, ఆకాశానికే పరిమితం కావని ద్వివేది చెప్పారు. స్పేస్, సైబర్, కాగ్నిటివ్ డొమెయిన్లలోనూ యుద్ధ ప్రభావం ఉంటుందన్నారు. మోహరింపులు, రక్షణ చర్యలపై మిలటరీ వ్యూహకర్తలు అత్యంత అప్రత్తంగా ఉండాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్తో భారత్ తన సత్తా చాటిందని, సైనకదళాలు కచ్చితత్వంలో దాడి చేయగలవని నిరూపించాయని చెప్పారు. భవిష్యత్ యుద్ధాల విషయంలోనూ ప్రజావిశ్వాసం, జాతీయ సమైక్యత కీలకాంశాలుగా ఉంటాయన్నారు. గత దశాబ్ద కాలంగా బలగాల సామర్థ్యంలో అద్భుతమైన పరివర్తన చోటుచేసుకుంటోందని, ఇందులో యువత భాగస్వామ్యం కీలకంగా ఉందన్నారు. ఈ మార్పుల్లో భాగంగా డ్రోన్ బెటాలియన్లు, దివ్యాస్త్ర బ్యాటరీలు, శక్తిమాన్ రెజిమెంట్లు, భైరవ్ బెటాలియన్లు, ఇతర టెక్నాలజీ ఆధారిత సైన్యాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. నెట్వర్గింగ్, డాటా-సెంట్రిసిటీ కీలకమైన వ్యూహాత్మక వనరులు కాబోతోందని తెలిపారు. డ్రోన్ల వినియోగంపై అన్ని అకాడమీల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
The post ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం: ఆర్మీ చీఫ్ ద్వివేది appeared first on Visalaandhra.


