Last Updated:
ECI Directs on SIR: దేశవ్యాప్తంగా “సర్” కలకలం రేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరిస్తుంటే.. దాన్ని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. బెంగాల్లో పెద్ద రచ్చే రేగింది. ఇప్పుడు సర్ ఫోకస్.. ఏపీ, తెలంగాణపై పడింది. ఇక మనం ఓటర్ ఐడీలను చెక్ చేసుకోవాలి.
మీ ఓటర్ ఐడీ బాగుందా? ఓటర్ కార్డు అంతా పర్ఫెక్టుగా ఉందా? ఆన్లైన్లో ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా? అన్నీ సరిగ్గా ఉన్నాయా? ఓసారి చెక్ చేసుకోండి. ఏవైనా సమస్యలు ఉంటే.. ఇప్పుడే సరిచేసుకోండి. ఒకవేళ మీకు 2 ఓటర్ కార్డులు ఉంటే.. వాటిలో ఏదో ఒకటే ఉంచుకోండి.. మరొకటి రద్దు చేయించుకోండి. ఇవన్నీ ఇప్పుడే చేసుకోవడం మేలు. ఎందుకంటే.. అతి త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఏపీ, తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో ఓటర్ జాబితాలను సవరించబోతోంది. దీన్నే సర్ (SIR) అని పిలుస్తున్నారు. అంటే.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అర్థం. ఈ సర్ ద్వారా.. కేంద్ర ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితాల్ని పూర్తిగా పరిశీలించి, తప్పులను సరిచేస్తుంది. అంటే ప్రక్షాళన చేస్తుందన్నమాట. ఇది ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది.
ఈ సర్ ప్రక్రియను ఈసీ.. ఇప్పటికే బీహార్లో పూర్తి చేసింది. మరో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి చేస్తూ ఉంది. మిగతా 22 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల సంగతి చూడబోతోంది. ఇది పూర్తైతే.. ఓటర్ల జాబితాలో అక్రమాలు దాదాపు తొలగినట్లే అవుతుంది. అప్పుడు ప్రజల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చు. 2027లో కేంద్రం జనాభా లెక్కల గణన ప్రారంభించాలి అనుకుంటోంది. అప్పటికల్లా… ఓటర్ల జాబితాలను పర్ఫెక్ట్ చెయ్యాలి అని ECI ప్లాన్ చేస్తోంది.
ఈ సర్ ప్రక్రియ మొదలయ్యాక.. ఎన్నికల అధికారులు, సిబ్బందీ.. ప్రతీ ఇంటికీ వస్తారు. ఇంట్లో అందరి ఓటర్ జాబితాల్నీ చెక్ చేస్తారు. పూర్తి వివరాల్ని క్రాస్ చెక్ చేస్తారు. ఏవైనా తప్పులు ఉంటే, వెంటనే సరిచేస్తారు. ఓటర్ల జాబితాలో పేరు ఉండి, ఆ వ్యక్తి లేకపోతే, ఆ పేరును జాబితా నుంచి తొలగిస్తారు. కాబట్టి.. వాళ్లు వచ్చే లోపే.. ఏవైనా సమస్యలు ఉంటే.. మనమే ముందుగా సరిచేసుకోవడం మేలు.
ఈ సర్ ప్రక్రియ ద్వారా.. కొన్ని లక్షల ఓటర్ల పేర్లను ఈసీ తొలగిస్తోంది. బెంగాల్లో 58లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లను తొలగించింది సీఈసీ. ఇది నచ్చని సీఎం మమతా బెనర్జీ.. రచ్చ రచ్చ చేశారు. అసలు సర్ ప్రక్రియనే రద్దు చెయ్యాలన్నారు. కానీ.. సుప్రీంకోర్టు.. సర్ కొనసాగించాలనీ.. దానికి ఎలాంటి అడ్డంకులూ సృష్టించకూడదని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాంటి అభ్యంతరాలు మన తెలుగు రాష్ట్రాల్లో రాకపోవచ్చు. కాకపోతే, ఎన్ని పేర్లను ఏపీ, తెలంగాణలో తొలగిస్తుందో అనే చర్చ మొదలైంది. చూద్దాం ఏం జరుగుతుందో.
ఏపీలో ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఓటర్లు తమ పేరును సంవత్సరంలో 4 సార్లలో ఎప్పుడైనా నమోదు చేయించుకోవచ్చు. ఇప్పటి వరకు సంవత్సరానికి ఒక్కసారి.. జనవరి 1న మాత్రమే ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు జనవరి 1తోపాటూ.. ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1న కూడా నమోదు చేసుకునే వీలు కల్పించారు. దీని వల్ల ప్రతీ 3 నెలలకూ కొత్త ఓటర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంటుంది. 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. దీని వల్ల యువ ఓటర్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



