విశాలాంధ్ర-హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి తన భార్య దానమ్మతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం వెల్లడించారు. పసునూరి నరహరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సందర్భంగా డీజీపీ మాట్లాడారు. నరహరి లొంగుబాటుతో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ‘పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి. డిగ్రీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిపోయారు. 1982లో అజ్ఞాత దళ సభ్యుడిగా చేరారు. 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. తుపాకులు, మోర్టార్లు, రాకెట్లు, గ్రనేడ్ల తయారీలో ఆయన నిపుణుడు. సాంకేతిక, సంస్థాగత బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తిస్తూనే… ఆయుధాల ఉత్పత్తి, మరమ్మతు, నిర్వహణకు సంబంధించి మావోయిస్టు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేవారు. మావోయిస్టు కార్యకలాపాలను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలి. తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలు గణపతి, జాడే సుజాత, వార్త శేఖర్ మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సాయమందిస్తోంది’ అని డీజీపీ తెలిపారు.


