విశాలాంధ్ర – సచివాలయం: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ వి.విజయ్ రామరాజు విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఇంచార్జి కమిషనర్గా ఎ. భార్గవ్ తేజ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఆర్డీఏ అదనపు కమిషనర్గా విధుల్లో ఉన్న ఆయనకు కమిషనర్ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ సోమవారం జీవో 660 జారీ చేశారు. విజయ్ రామరాజు వ్యక్తిగత కారణాల రీత్యా జులై 17 నుంచి 26వ తేదీ వరకు సెర్బియా, బల్గేరియా దేశాలలో పర్యటించనున్నారు. ఆయన సెలవులో ఉండే ఈ పది రోజుల కాలంలో రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు అమరావతి పరిధిలోని రోజువారీ పరిపాలనా కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ముందస్తు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అమరావతిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయానికి స్పష్టం చేశారు.


