Road Accident: అరగంటలో ఇంటికి చేరిపోతారు.. కానీ ఆ ఘోర రోడ్డు ప్రమాదం ఆపేసింది.. లారీని ఢీ కొని ఓకే కుటుంబంలో ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Road Accident: అనకాపల్లి జిల్లాలో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబం మినీ వ్యాన్ కశింకోట వద్ద లారీని ఢీకొని ఇద్దరు మృతి, ఆరుగురు గాయాలు, గ్రామాల్లో తీవ్ర విషాదం

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మరో అరగంటలో క్షేమంగా ఇళ్లకు చేరుకుంటారనుకున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన వారి ఆధ్యాత్మిక యాత్ర విషాదాంతమైంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీరని చీకట్లను నింపింది. కశింకోట మండలం ఉగ్గినాపాలెం వద్ద జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

ఈనాడు కథనం ప్రకారం అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అరబుపాలెం, మూలపేట గ్రామాలకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది దగ్గరి బంధువులు కలిసి ఒక వ్యాన్‌లో గురువారం ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు. వీరంతా కలిసి మొదట భద్రాచలం వెళ్లి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) తదితర క్షేత్రాలను సందర్శించారు. శుక్రవారం రాత్రి పూజలు ముగించుకుని తిరిగి స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు.

శనివారం తెల్లవారుజామున వీరి వాహనం కశింకోట మండలం ఉగ్గినాపాలెం వద్దకు చేరుకుంది. అదే సమయంలో జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచిన ఒక లారీని వీరి వ్యాన్ అతి వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాద తీవ్రతకు వ్యాన్ ముందు భాగం నలిగిపోయింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆడారి కూర్మారావు (45) (అరబుపాలెం), ఆయన మరదలు సూరిశెట్టి జ్యోతి (31) (మూలపేట) తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్ లో ఉన్న సూరిశెట్టి గ్రీష్మ, దాడి పద్మ, శరగడం అప్పలకొండ, పద్మశ్యామల తీవ్రంగా గాయపడగా, వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై కశింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కూర్మారావు, జ్యోతిల అకాల మరణం ఆయా కుటుంబాలను కోలుకోలేని దెబ్బ తీసింది. వారి పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఈ ప్రమాదం ఆడారి కూర్మారావు కుటుంబంలో ఊహించని విషాదాన్ని నింపింది. గతంలో కరోనా సమయంలో కూర్మారావు భార్య రేవతి అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి లేని లోటు తెలియకుండా కూర్మారావు తన ఇద్దరు కొడుకులను ప్రాణంగా చూసుకుంటూ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. తన మేనల్లుడి పెళ్లిరోజు వేడుకల సందర్భంగా బంధువులతో కలిసి ఆయన భద్రాచలం యాత్రకు వెళ్లారు.

అయితే ఈ ప్రమాదంలో తండ్రి సైతం దూరమవడంతో ఆ ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. కూర్మారావు పెద్ద కుమారుడు నిఖిల్ ఆర్‌ఈసిఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతుండగా, రెండో కుమారుడు జితేంద్ర పదో తరగతి చదువుతున్నాడు. “అమ్మ లేకపోయినా మాకు అండగా ఉన్న నాన్న మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడు, ఇక మమ్మల్ని ఎవరు చూసుకుంటారు?” అంటూ ఆ పిల్లలు రోదించిన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కన్నీటి పర్యంతం చేసింది. శనివారం కూర్మారావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన అరబుపాలెంలో జరిగాయి.

మరో మృతురాలు సూరిశెట్టి జ్యోతి (31) కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కుటుంబ పోషణ కోసం ఆమె భర్త రాజు దుబాయ్ వెళ్లారు. జ్యోతి తన ఇద్దరు కుమార్తెలు అశ్విని, గిరిష్మలతో కలిసి గాజువాకలో నివసిస్తున్నారు. ఈ ప్రమాదంలో జ్యోతి మరణించగా, ఆమెతో పాటు ఉన్న ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి.

భార్య మరణించిన వార్త దుబాయ్‌లో ఉన్న రాజుకు తెలియడంతో ఆయన గుండె పగిలినంత పనైంది. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి స్వగ్రామానికి వస్తున్నారు. ఆదివారం జ్యోతి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే కుటుంబంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *