Last Updated:
విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో బాపట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవుల పూర్ణగోపి (35) అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, అతని తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు.
Bapatla: ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో స్థిరపడి, కన్నవారిని సైతం తమ వద్దకు పిలిపించుకుని ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నిండింది. అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం బాపట్ల పట్టణానికి చెందిన ఒక తెలుగు కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో బాపట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవుల పూర్ణగోపి (35) అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, అతని తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు.
బాపట్ల పట్టణం యాదవపాలెం (కొత్త బస్టాండ్ సమీపంలో) నివాసం ఉండే ఆవుల శ్రీనివాసరావు ఇండియన్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. దేశసేవ అనంతరం ఆయన బాపట్ల ఏరియా ఆసుపత్రిలో సుదీర్ఘకాలం పాటు 108 అంబులెన్స్ డ్రైవర్గా సేవలందించి స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆవుల పూర్ణగోపి (35) ఐదేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్ (MS) పూర్తి చేసిన అనంతరం, న్యూ మెక్సికోలో ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డారు. అతని చిన్న కుమారుడు మురళి కూడా మూడేళ్ల క్రితమే అమెరికా వెళ్లి అక్కడే పైచదువులు చదువుకుంటున్నాడు. ఇద్దరు కొడుకులు అమెరికాలో చక్కగా స్థిరపడటంతో సంతోషించిన శ్రీనివాసరావు, ఆయన భార్య నలిని దంపతులు కొడుకులను చూసేందుకు నెల రోజుల క్రితమే అమెరికా వెళ్లారు.
నెల రోజులుగా కొడుకులతో కలిసి ఎంతో సంతోషంగా గడిపిన తల్లిదండ్రులు, బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం) కుటుంబ సమేతంగా కలిసి ఒక విహారయాత్రకు వెళ్లారు. అందరూ కలిసి రోడ్డు మార్గంలో కారులో ప్రయాణించారు. విహారయాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో, కారును చిన్న కుమారుడైన ఆవుల మురళి నడుపుతున్నాడు. అయితే చాలా దూరం ప్రయాణించడం వల్ల మురళికి తీవ్రంగా నిద్ర వస్తున్నట్లు అనిపించింది. ప్రమాదాలను నివారించేందుకు, కారును కాసేపు పక్కన ఆపి, తన అన్న పూర్ణగోపిని డ్రైవింగ్ సీట్లోకి మారవలసిందిగా కోరాడు.
తమ్ముడి మాట ప్రకారం పూర్ణగోపి కారు దిగి, డ్రైవర్ సీటు వైపు వెళ్లి లోపల కూర్చునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో విధి వంచించింది. వెనుక నుంచి ఒక మహిళ అతివేగంగా నడుపుకుంటూ వచ్చిన వాహనం నియంత్రణ కోల్పోయి వీరి కారును అత్యంత బలంగా ఢీకొట్టింది.
ఈ భయంకరమైన ప్రమాదంలో కారు వెలుపల డ్రైవర్ సీట్లోకి ఎక్కబోతున్న పూర్ణగోపి వాహనాల మధ్య నలిగిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారు లోపల కూర్చుని ఉన్న అతని తండ్రి శ్రీనివాసరావు, తల్లి నలిని, తమ్ముడు మురళిలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరి కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన వాహనాన్ని నడిపిన మహిళ కూడా ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం అందింది.
తమ కళ్ల ముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడం, మిగిలిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి పాలవడంతో బాపట్లలోని వారి బంధువులు, యాదవపాలెం స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంతో సాత్వికుడైన పూర్ణగోపి అకాల మరణం చెందడంపై స్థానికంగా తీవ్ర సంచలనం మరియు విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు, ఆసుపత్రిలో ఉన్న మిగిలిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని బాధితుడి బంధువులు ప్రభుత్వ అధికారులను, ఎన్నారై సంఘాలను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



