Last Updated:
Tirupati: తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు.
Tirupati: తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. 14వ దశ మొబైల్ రికవరీ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను గుర్తించి అసలు యజమానులకు తిరిగి అందజేశారు. CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సహకారంతో ఈ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగింది. తమ విలువైన మొబైల్ ఫోన్లు తిరిగి దక్కడంతో బాధితులు పోలీసులపై కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లాలో చోరికి గురైన, పోయిన సెల్ ఫోన్స్ రికవరీ చేశారు పోలీసులు. మొత్తం 500 మొబైల్ ఫోన్ల మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు సత్వర సేవలు అందించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, సాంకేతిక విభాగం సమన్వయంతో ఫోన్ల ట్రాకింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన రికవరీ కార్యక్రమాల ద్వారా మొత్తం 4 వేల 785 మొబైల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా పోయిన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి బాధితులకు అందించడం జరుగుతోందని ఎస్పీ తెలిపారు. రాష్ట్రాల మధ్య సమన్వయం, సాంకేతిక ఆధారిత దర్యాప్తు, IMEI ట్రాకింగ్ వంటి ఆధునిక విధానాల వల్ల ఈ రికవరీలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. పోలీసులు కేవలం నేర నియంత్రణలోనే కాకుండా ప్రజల ఆస్తులను తిరిగి అందించడంలో కూడా సమర్థంగా పనిచేస్తున్నారనే నమ్మకం ఈ కార్యక్రమం ద్వారా మరింత బలపడిందన్నారు.
మొబైల్ ఫోన్ పోయిన వెంటనే బాధితులు ఆలస్యం చేయకుండా CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని జిల్లా పోలీసులు సూచించారు. ఫిర్యాదు త్వరగా నమోదు చేస్తే మొబైల్ ఫోన్ ట్రాకింగ్ సులభమై, రికవరీ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. అదేవిధంగా CEIR సేవలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం 9490617873 వాట్సాప్ నంబర్కు “హాయ్” అని మెసేజ్ పంపితే అవసరమైన వివరాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మొబైల్ భద్రతపై జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh
May 20, 2026 11:17 AM IST


