ఏపీకి వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. జూన్ మొదటి వారంలోనే రుతుపవనాల ఎంట్రీ..! southwest monsoon Andhra Pradesh. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

మే 26న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు, జూన్ 10 నాటికి ఎక్కువ ఏపీ, 15 నాటికి మొత్తం రాష్ట్రాన్ని కవరిస్తాయి, ఎండలు తగ్గి వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు అవకాశం

+

News18

News18

భగభగలాడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వేగంగా దూసుకొస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని, గతంతో పోలిస్తే సకాలంలోనే ఇవి రాష్ట్రాన్ని పలకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం మండిపోతున్న ఎండల మధ్య ఈ వార్త ప్రజల్లో ఊరటనిస్తోంది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మే 26 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. అక్కడి నుంచి వేగంగా ముందుకు కదులుతూ జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయని అధికారులు చెబుతున్నారు. జూన్ 5 నాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించే అవకాశం ఉండగా, అనంతరం కోస్తా జిల్లాల వైపు కదిలి జూన్ 10 నాటికి అక్కడ కూడా ప్రభావం చూపనున్నాయి. ఇక జూన్ 15 నాటికి రాష్ట్రం మొత్తం రుతుపవనాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని జగన్నాథ్ కుమార్ స్పష్టం చేశారు.

రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వర్షాలు ప్రారంభమైతే వాతావరణం చల్లబడటంతో పాటు సాగు పనులకు కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. దీంతో రైతాంగం కూడా ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమవుతోంది.

ఇక సముద్ర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు కూడా వేగంగా మారుతున్నాయి. రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు వాయుగుండాల ప్రభావంతో ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.

మరోవైపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినప్పటికీ, రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు మాత్రం కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల మెరుపులు, బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరించారు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశమున్నందున రైతులు, మత్స్యకారులు, బయట పనులు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. మొత్తంగా చూస్తే.. ఎండలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు రుతుపవనాల రాక పెద్ద ఉపశమనంగా మారబోతోందని చెప్పొచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *