జమిలి ఎన్నికలతో రూ.7 లక్షల కోట్ల ఆదా: పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్


దేశంలో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక్ణ విధానాన్ని అమలు చేస్తే సుమారు రూ.7 లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చైర్‌పర్సన్, లోక్‌సభ ఎంపీ పీపీ చౌదరి తెలిపారు. దీనివల్ల దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. మంగళవారం గాంధీనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దేశంలో నిరంతరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో దేశం ఎన్నికల మోడ్‌లోనే ఉంటోందని, దీనివల్ల పాలన, అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని చౌదరి అన్నారు. 1967 వరకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగేవని, కానీ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందుగా రద్దు కావడంతో ఈ క్రమం తప్పిందని గుర్తుచేశారు.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించి, ఆ తర్వాత 100 రోజుల్లోగా పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలను పూర్తి చేయాలని తమ కమిటీ సిఫార్సు చేస్తోందని వివరించారు. తరచూ ఎన్నికల వల్ల ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు కేటాయించాల్సి వస్తోందని, దీనివల్ల పాలనాపరమైన పనులు, విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకంపై ఆధారపడిన ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఎన్నికల వల్ల నష్టపోతోందని పేర్కొన్నారు.

జమిలి ఎన్నికల ప్రతిపాదన రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గానీ, సమాఖ్య వ్యవస్థకు గానీ విరుద్ధం కాదని మాజీ ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయ నిపుణులు అభిప్రాయపడినట్లు చౌదరి తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపుల తర్వాత 18,000 పేజీలకు పైగా నివేదికను సిద్ధం చేస్తున్నామని, పార్టీ రాజకీయాలకు అతీతంగా జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ప్రయత్నం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *