Last Updated:
Tirumala Temple: తిరుమలలో భారీ భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోగా శిలాతోరణం వరకు క్యూలు, టీటీడీ అన్నప్రసాదం, నీరు, ఉచిత బస్సులు పెంచి, విఐపి బ్రేక్ దర్శనాలు జులై 15 వరకు రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్డులోని శిలా తోరణం వరకు క్యూ లైన్ వ్యాపించి ఉంది. వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది.
గత 10 రోజుల్లో శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా శిలాతోరణం, బాట గంగమ్మ గుడి, మార్గలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తుల సౌకర్యార్థం అన్ని ప్రాంతాల్లో తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం అక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా ఉచిత బస్సులు ఏర్పాటు చేసి ప్రతి నిమిషానికి భక్తులను చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 60 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 50 వేల మందికి అన్నప్రసాదాలు (ఇందులో ఉప్మా, పొంగల్ ఉన్నాయి) పంపిణీ చేశారు.
సాధారణం కంటే రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించారు. అంతే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తుల అధిక రద్దీ కారణంగా జులై 15వ తేదీ వరకు విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్ధు చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


