Last Updated:
ACA-VDCA స్టేడియంలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండు రోజుల పాటు జరగనుంది. 7 జట్లు, 110 సెలబ్రిటీలు పాల్గొంటారు. ఆదాయం పేద పిల్లల విద్య, సీఎం సహాయ నిధికి వినియోగిస్తారు.
విశాఖ క్రీడాభిమానులకు రెండు రోజుల పాటు సెలబ్రిటీ క్రికెట్ సందడి రాబోతోంది. టాలీవుడ్ నటులు, టీవీ ఆర్టిస్టులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకే మైదానంలో ఆడబోయే ఈ సెలబ్రిటీ లీగ్ పోటీలు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ నెల 28, మార్చి 1 తేదీల్లో మ్యాచ్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
విశాఖపట్నం మధురవాడలోని ACA-VDCA స్టేడియంలో ఈ టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరగనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. హోటల్ మేఘాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సౌత్ ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి పోటీల వివరాలను వెల్లడించారు. ఈ రెండు రోజుల ఈవెంట్ను క్రికెట్ పండుగలా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ లీగ్లో టాలీవుడ్ నటులు, టీవీ ఆర్టిస్టులతో రెండేసి జట్లు, పోలీసులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులతో ఒక్కో జట్టు చొప్పున మొత్తం 7 జట్లు బరిలోకి దిగనున్నాయి. దాదాపు 110 మంది సెలబ్రిటీలు మైదానంలో సందడి చేయనున్నారు. ఐపీఎల్ తరహాలో మ్యాచ్ల డిజైన్, టీమ్ ఫార్మాట్, వినోదాత్మక అంశాలతో ప్రేక్షకులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్లాన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద పిల్లల విద్య, సీఎం సహాయ నిధి, ఇతర దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. క్రీడల ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం ఈ లీగ్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నగరాన్ని అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొత్త క్రీడా వసతులు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
మధురవాడ స్టేడియంలో వసతులు మెరుగుపడటానికి BCCI సహకారం ఉందని, భవిష్యత్తులో వన్డే, టీ20, అలాగే IPL మ్యాచ్ల కేటాయింపులో విశాఖకు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం, కనెక్టింగ్ రోడ్లు పూర్తైతే విశాఖ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని చెప్పారు. సెలబ్రిటీ లీగ్ నిర్వాహకులు ఈ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. కుటుంబాలతో కలిసి వచ్చి ఈ క్రికెట్ పండుగను ఆస్వాదించాలని విశాఖ ప్రజలకు పిలుపునిచ్చారు. సినీ తారలు, ప్రముఖులు మైదానంలో ఆడబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



