Last Updated:
తిరుపతి National Sanskrit Universityలో పాక్ శాస్త్రి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆన్లైన్లో ప్రారంభం, పదో తరగతి ఉత్తీర్ణులకు అవకాశం, స్కాలర్షిప్లు వర్తింపు
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పుడు అరుదైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జూనియర్ కాలేజీలకు భిన్నంగా, నేషనల్ యూనివర్సిటీ వాతావరణంలోనే ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని తిరుపతిలోని National Sanskrit University కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగా నిర్వహిస్తున్న పాక్ శాస్త్రి ఇంటర్మీడియట్ కోర్సులకు ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని వర్సిటీ అధికారులు వెల్లడించారు. దీంతో సంస్కృత విద్యతో పాటు ఆధునిక సబ్జెక్టులను అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ కోర్సుల్లో కేవలం సంస్కృత విద్య మాత్రమే కాకుండా కంప్యూటర్స్, గణితం, హిస్టరీ, వ్యాకరణం, సాహిత్యం, జ్యోతిష్యం, ఫిలాసఫీ, యోగా వంటి విభిన్న సబ్జెక్టుల్లో నాణ్యమైన బోధన అందించనున్నట్లు వర్సిటీ తెలిపింది. సంప్రదాయ విద్యతో పాటు ఆధునిక అంశాలను కలిపి బోధించడం ఈ కోర్సు ప్రత్యేకతగా మారింది. ముఖ్యంగా సంస్కృతంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది భవిష్యత్తులో ఉన్నత విద్యకు బలమైన పునాది అవుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.
వర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులు. సంస్కృతంపై ప్రాథమిక అవగాహన ఉంటే మరింత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. రెండు సంవత్సరాల వ్యవధి కలిగిన ఈ కోర్సులో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విడతలుగా బోధన కొనసాగుతుంది.
ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు తర్వాత శాస్త్రి (B.A in Sanskrit) డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందే అర్హత లభిస్తుంది. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందించే స్కాలర్షిప్లు కూడా ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు వర్తిస్తాయని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ఇది మంచి అవకాశంగా మారింది.
ఈ అడ్మిషన్లపై స్పందించిన ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, వీసీ ఎన్. సుమా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని, లేదా 7382595500, 7382585500 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ప్రస్తుతం సంప్రదాయ విద్యతో పాటు విలువల ఆధారిత విద్యకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సులకు మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh



