భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఎండ వేడి తగలకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు నీడనిచ్చేలా ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు.
ముఖ్యంగా ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు మరియు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై వేడిని తగ్గించే సింథటిక్ ఎనామిల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తుల పాదాలు కాలకుండా చర్యలు తీసుకున్నారు.
క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు భక్తులకు నిరంతరం సేవలందిస్తున్నారు.
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే మొబైల్ వాటర్ డ్రమ్ములతో వెళ్లి తాగునీటిని పంపిణీ చేస్తున్నారు.
ప్రతిరోజూ మూడు బ్యాచ్లలో మొత్తం 45 మంది సేవకులు ఈ తాగునీటి సరఫరా పనుల్లో పాలుపంచుకుంటున్నారు.
క్యూలైన్ల పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పారిశుధ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
భక్తుల ఆరోగ్యం కోసం తిరుమలలో మొత్తం 16 వైద్య కేంద్రాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు మరియు నారాయణగిరి ప్రాంతాల్లో మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
లడ్డూ ప్రసాదం విషయంలో భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ తగిన జాగ్రత్తలు తీసుకుంది.
సాధారణంగా రోజుకు 3.50 లక్షల లడ్డూలు అందుబాటులో ఉండగా, వేసవి రద్దీ దృష్ట్యా మరో 3.50 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా సిద్ధం చేశారు.
ప్రస్తుతం తిరుమలలో సుమారు 7,500 గదులు, 5 యాత్రికుల వసతి సముదాయాలు (PAC) అందుబాటులో ఉన్నాయి. సుమారు 60 వేల మందికి మించి వసతి కేటాయించే అవకాశం లేనందున, గదులు లభించని భక్తులు పీఏసీలలోని సుమారు 9,000 లాకర్లను ఉపయోగించుకోవచ్చని టీటీడీ సూచించింది. ఇక తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ప్రధాన కళ్యాణకట్టతో పాటు 11 మినీ కళ్యాణకట్టలలో మొత్తం 1152 మంది క్షురకులు (వీరిలో 269 మంది మహిళలు) సేవలందిస్తున్నారు.


