Last Updated:
నాణ్యతా ప్రమాణాలను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను సడలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కమిషన్ నిర్ధారించింది.
Tirumala Ghee Adulteration Case: ప్రపంచప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ కావడానికి నాటి తితిదే అదనపు ఈవో/ఈవో ఏవీ ధర్మారెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. నాణ్యతా ప్రమాణాలను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను సడలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కమిషన్ నిర్ధారించింది.
వైకాపా ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్తో కూడిన ఏకసభ్య కమిషన్ వెల్లడించింది. గతంలో ఉన్న కఠినమైన టెండర్ నిబంధనలను ధర్మారెడ్డి స్వయంగా సడలించారని, ఆ నిర్ణయాల ఫలితంగానే నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసే మోసపూరిత సంస్థలు తితిదేలోకి ప్రవేశించాయని నివేదిక పేర్కొంది. సరఫరా సంస్థల అర్హతలు, విశ్వసనీయత మరియు వాటి సామర్థ్యాన్ని పరిశీలించడంలో నాటి యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కమిషన్ నిగ్గుతేల్చింది.
కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు తేలినప్పటికీ, సదరు సంస్థలపై చర్యలు తీసుకోకుండా వాటిని కొనసాగించడంపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022 ఆగస్టులోనే కొన్ని సంస్థలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు తేలినా, వాటిని బ్లాక్లిస్ట్లో పెట్టకుండా ధర్మారెడ్డి అనుమతించారని నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా బీటా సిటోస్టెరాల్ వంటి కీలకమైన నాణ్యత పరీక్షలను తప్పనిసరి చేయకుండా నిబంధనలను ఉల్లంఘించారని, దీనివల్ల కల్తీ నెయ్యి వినియోగాన్ని అరికట్టే అవకాశం లేకుండా పోయిందని వెల్లడించింది.
ఈ కుంభకోణంలో ధర్మారెడ్డితో పాటు అప్పటి ఈవో అనిల్కుమార్ సింఘాల్, ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయంపై కూడా కమిషన్ ప్రస్తావించింది. టెండర్ నిబంధనల సడలింపు వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలను అంచనా వేయకుండానే ప్రొక్యూర్మెంట్ విభాగం అధికారులు ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని నివేదిక వివరించింది. అలాగే నాటి పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, నెయ్యి నమూనాల పరీక్షల ఫలితాల గురించి తెలిసినా పట్టించుకోలేదని, బాధ్యతారహితంగా వ్యవహరించారని అధికారులు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారు.
కల్తీ నెయ్యి సరఫరాకు బాధ్యులైన ఏవీ ధర్మారెడ్డిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి కింది సూచనలు చేసింది:
తితిదే బోర్డులో రాజకీయ నియామకాల కంటే నిపుణులకే ప్రాధాన్యత ఇవ్వాలి. బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేయాలి. నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలను మెరుగుపరచాలి. టెండర్ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ, కేవలం అర్హత కలిగిన సంస్థలకే అనుమతినివ్వాలి. శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



