తిరుమలలో ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, నిల్వల వివరాలను తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం హెచ్పీ పెట్రోల్ బంకులో సుమారు 1000 లీటర్ల పెట్రోల్, 3000 లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి మరిన్ని ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా జరగనుంది.
ఇంధన సరఫరాను సమర్థవంతంగా నిర్వహించడానికి టీటీడీ, పెట్రోల్ బంకు యాజమాన్యం కలిసి పనిచేస్తున్నాయి. నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
అందరికీ కనీస అవసరమైన ఇంధనం అందేలా తాత్కాలిక పరిమితులు విధించారు. ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి 1 లీటర్, కార్లు, జీపులు, టెంపో ట్రావెలర్లకు గరిష్టంగా 5 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం అందుబాటులో ఉంటుంది. ఈ పరిమితి తాత్కాలికమని, అందరికీ సమానంగా ఇంధనం అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని భరోసా ఇచ్చారు.


