నర్సంపేటకు వెళుతుండగా, సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ అరెస్టు


వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అరెస్టు చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిని రఘునాథపల్లి పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.నర్సంపేట వెళుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను స్టేషన్ ఘనపూర్ పోలీసులు మార్గమధ్యంలో ఆపి, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా, నర్సంపేటలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో వరకు తీసుకువెళ్లడానికి కార్మికులు ప్రయత్నించారు. డిపో వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తామని వారు తెలిపారు. అయితే అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపోకు తరలించి, కార్మికులు ఆయనను కడసారిగా చూసి నివాళులు అర్పిస్తామని చెబుతుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు, కార్మికుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 22 ఏళ్లకు పైగా నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న శంకర్ గౌడ్ మృతదేహానికి కార్మికులు డిపో వద్ద నివాళులు అర్పిస్తేనే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు.

The post నర్సంపేటకు వెళుతుండగా, సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ అరెస్టు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *