దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్పై క్లిక్ చేసి తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డు ఐడీని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు పొందొచ్చు. అలాగే, డిజీ లాకర్ ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
పెరిగిన ఉత్తీర్ణత.. బాలికలదే పైచేయి
ఈ పరీక్షల్లో 93.70శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగిందని తెలిపింది. సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని, వీరి ఉత్తీర్ణత శాతం 94.99శాతంగా నమోదైందని పేర్కొంది. మొత్తంగా 2.2లక్షల మంది 90శాతం స్కోరు సాధించగా.. 55వేల మందికి పైగా 95శాతం స్కోరుతో మెరిశారని బోర్డు వెల్లడించింది. ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను రెండు విడతల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. మే నెలలో రెండో ఎడిషన్ పరీక్షలు ఉండటంతో తొలి విడత పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం విడుదల చేసింది.


