విశాలాంధ్ర – కూడేరు..అనంతపురం రూరల్ మండల పరిధిలోని కొడిమి గ్రామ సమీపంలో దళిత రైతు ఎం. గోవిందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చెందినవాడు.గోవిందు తన వ్యవసాయ భూమిలో పంట సాగు చేయడానికి, నీటి బోరు త్రవ్వించేందుకు బయటి వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షలకు పైగా అప్పు తీసుకున్నాడు. అయితే బోరులో నీరు పడకపోవడం, పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు మరింత పెరిగాయి. అప్పులపై వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మనస్తాపానికి గురయ్యాడు.ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఇంటి నుంచి అనంతపురం వెళ్తానని చెప్పి బయటకు వెళ్లిన గోవిందు, మార్గమధ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై అనంతపురం రూరల్ సీఐ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


