Last Updated:
తిరుమలలో ఎండ తీవ్రత మధ్య టీటీడీ మొబైల్ వాటర్ సర్వీస్ తో భక్తులకు తాగునీరు, కూల్ పెయింటింగ్, ఫ్యాన్లు, ఫాగర్స్, NABL ల్యాబ్ ద్వారా నీరు ఆహార నాణ్యత భద్రత.
తిరుమల పుణ్యక్షేత్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపట్టిన చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయి. వేసవి తాపం నుంచి భక్తులను కాపాడేందుకు, వారికి సులభంగా తాగునీరు అందుబాటులో ఉంచేందుకు ప్రవేశపెట్టిన ‘మొబైల్ వాటర్ సర్వీస్’ ప్రస్తుతం తిరుమలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది. సెలవు దినాలు కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. మండుతున్న ఎండల వల్ల భక్తులు డీహైడ్రేషన్ బారిన పడకుండా టీటీడీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది.
సాధారణంగా భక్తులు నీటి కోసం క్యూ లైన్ల నుంచి బయటకు రావడం లేదా కుళాయి వద్దకు వెళ్లడం కష్టతరమైన పని. దీనిని గుర్తించిన టీటీడీ, మొబైల్ వాటర్ డ్రమ్స్ విధానాన్ని అమలులోకి తెచ్చింది.
వందలాది మంది శ్రీవారి సేవకులు భుజాలపై నీటి డ్రమ్ములను మోస్తూ లేదా చక్రాల స్టాండ్లపై అమర్చిన డ్రమ్ముల ద్వారా భక్తులు ఉన్న చోటికే వెళ్లి గ్లాసులతో తాగునీటిని అందిస్తున్నారు. మాడ వీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నిత్యాన్నదానం వెలుపల, బస్టాండ్ ప్రాంతాల్లో ఈ సేవలు నిరంతరాయంగా అందుతున్నాయి. “గోవిందా.. గోవిందా..” అంటూ నామస్మరణ చేస్తూ సేవకులు అందించే నీరు భక్తుల దాహాన్ని తీర్చడమే కాకుండా, వారిలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతోంది.
భక్తులకు అందించే నీరు, ఆహారం కేవలం సమృద్ధిగా ఉండటమే కాకుండా, అత్యంత శుభ్రంగా ఉండాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1981లో ఏర్పాటు చేసిన నీరు ఆహార విశ్లేషణ ప్రయోగశాల నేడు దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో (NABL గుర్తింపుతో) నడుస్తోంది.
తిరుమల వ్యాప్తంగా వివిధ పాయింట్ల నుంచి ప్రతిరోజూ సుమారు 20 నీటి నమూనాలను సేకరిస్తారు. అందులో క్లోరిన్ శాతం, బ్యాక్టీరియా ఉనికిని నిశితంగా పరిశీలిస్తారు. నెలకు దాదాపు 1200 పరీక్షలు నిర్వహిస్తూ స్వచ్ఛతను నిర్ధారిస్తారు. స్వామివారి ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి, బియ్యం, శనగపిండి ఇతర దినుసులను ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే వంటశాలకు పంపిస్తారు. లడ్డూల రుచి నాణ్యతలో స్థిరత్వం ఉండటానికి ఈ శాస్త్రీయ విశ్లేషణే ప్రధాన కారణం.
ఎండ ప్రభావం తగ్గించేందుకు మాడ వీధుల్లో ‘కూల్ పెయింటింగ్’ వేయడం, క్యూ లైన్లలో చల్లని గాలి కోసం ఫ్యాన్లు, ఫాగర్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు భక్తులకు ఎంతో ఊరటనిస్తున్నాయి. నడక దారిలో వచ్చే భక్తులకు దారి పొడవునా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


