Last Updated:
ఏపీలో ఎండ తీవ్రత పెరుగుతోంది, ఏపీఎస్డిఎమ్ఏ ఎండి ప్రఖర్ జైన్ హెచ్చరిక, అనేక జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, వడగాలులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండతీవ్రత క్రమంగా పెరుగుతుందని, శనివారం 200 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం(12-04-26) ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం : శ్రీకాకుళం జిల్లా: బూర్జ, హిరమండలం, విజయనగరం జిల్లా: సంతకవిటి, వంగర మండలాలు పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ,కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సీతంపేట, వీరఘట్టం మండలాలు పోలవరం జిల్లా : చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం. ఏలూరు జిల్లా : కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో(19) తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
అలాగే 35 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. సోమవారం మొత్తంగా 70 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం కడప(జి) పొట్టిపాడులో 44.7°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 44.3°C, తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 44.2°C, నంద్యాల(జి) గోస్పాడు, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 42.8°C, కర్నూలు(జి) మంత్రాలయంలో42.7°C, మార్కాపురం(జి) నందన మారెళ్లలో 42.2°C, అనంతపురం(జి) రాయదుర్గం, చిత్తూరు(జి) సింధురాజపురంలో 42.1°C, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడు 41.9°C, శ్రీసత్యసాయి(జి) కొత్తచెరువులో 41.6°C, పల్నాడు(జి) గురజాలలో 41.2°C, మన్యం(జి) భామినిలో 41.1°సి చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండలో బయటకు వెళ్లేప్పుడు తలకి టోపి పెట్టుకోవాలని, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు. అదే విధంగా కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Apr 12, 2026 12:07 PM IST



