Last Updated:
ఇరాన్కు చెందిన ఇద్దరు డి ఫార్మసీ విద్యార్థినులు యుద్ధం వల్ల కుటుంబంతో సంబంధం కోల్పోయి ఆందోళనలో, విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వక్ఫ్ బోర్డ్ ఆర్థిక సహాయం అందించారు
విదేశాల్లో చదువుకోవడానికి వచ్చి కలల్ని సాకారం చేసుకోవాలని ఆశించిన ఇద్దరు యువతులు, ఇప్పుడు యుద్ధ భయంతో కన్నీళ్లు మున్నీళ్లు కారుస్తున్నారు. ఇరాన్కు చెందిన జీనాబ్ మహమ్మది, సాల్మన్ మహమ్మదీ అనే విద్యార్థినులు ప్రస్తుతం విశాఖపట్నంలో డి.ఫార్మసీ చదువుతున్నారు. అయితే గత పది రోజులుగా తమ కుటుంబ సభ్యులతో ఎలాంటి సంప్రదింపులు జరగకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు సురక్షితంగా ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు అంటూ వారి ఆవేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.
ఇప్పటివరకు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుకునే తమ కుటుంబ సభ్యులు, ఒక్కసారిగా సంప్రదింపులు నిలిచిపోవడంతో భయాందోళనలు పెరిగిపోయాయని వారు చెబుతున్నారు. యుద్ధ పరిస్థితుల మధ్య వారు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అన్న అనుమానాలు వెంటాడుతున్నాయని కన్నీళ్లతో వేదన వ్యక్తం చేశారు. కుటుంబం గురించి సమాచారం లేకపోవడం ఒకవైపు, డబ్బుల కొరత మరోవైపు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఈ పరిస్థితుల్లో వారు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ను కలిసి తమ సమస్యను వివరించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే స్పందించి, వారికి ఆర్థిక సహాయం అందజేస్తూ “మీకు మేము అండగా ఉంటాం” అని ధైర్యం చెప్పారు. విదేశీ నేలపై ఒంటరిగా ఉన్న ఈ విద్యార్థినులకు ఆయన ఇచ్చిన మద్దతు వారికి కొంత ఊరటనిచ్చింది.
ఇక ఈ విషయం తెలుసుకున్న వక్ఫ్ బోర్డ్ సభ్యులు కూడా ముందుకు వచ్చి రూ.1,50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కూడా తమ వంతుగా సహాయం చేసి, ఈ విద్యార్థినులకు అండగా నిలిచారు. సమాజం నుంచి వచ్చిన ఈ మద్దతు, కష్టాల్లో ఉన్న వారికి ఎంత పెద్ద ధైర్యాన్ని ఇస్తుందో మరోసారి నిరూపించింది.
సొసైటీ సభ్యుల సహాయం అందుకున్న తర్వాత ఆ ఇద్దరు విద్యార్థినులు భావోద్వేగానికి లోనయ్యారు. “ఇలాంటి సమయంలో మాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ కన్నీళ్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విదేశీ నేలపై పరాయి దేశానికి చెందిన ఈ విద్యార్థినులకు స్థానికులు చూపిన మానవత్వం అందరి హృదయాలను తాకుతోంది.
యుద్ధం వల్ల దూరంగా ఉన్న కుటుంబం గురించి తెలియని అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందులు ఇవి అన్నీ కలిసి వారి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనుషులు ఒకరికొకరు అండగా నిలిస్తే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలమో ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది. విశాఖలో చోటుచేసుకున్న ఈ ఘటన, మానవత్వం ఇంకా సజీవంగా ఉందని మరోసారి గుర్తు చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


