Tirumala Temple: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో నకిలీ ఆధార్‌లకు చెక్.. టీటీడీ సరికొత్త సాంకేతిక విప్లవం! |


Last Updated:

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధార్ రియల్ టైమ్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో టికెట్లు, గదుల కేటాయింపులో దళారులను అరికట్టి భక్తులకు సమాన అవకాశాలు కల్పించనుంది

News18
News18

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, మధ్యవర్తుల ఆగడాలను అరికట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సాంకేతికతను ఆశ్రయిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు, ప్రత్యేక దర్శన టికెట్ల జారీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఆధార్ రియల్ టైమ్ అథెంటికేషన్’, ‘ఫేస్ రికగ్నిషన్’ వ్యవస్థలను ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.

ప్రస్తుతం తిరుమలలో గదులు పొందాలన్నా లేదా లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవలు పొందాలన్నా భక్తులు తమ ఆధార్ కార్డులను సమర్పిస్తున్నారు. అయితే, కొందరు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి లేదా ఇతరుల గుర్తింపు కార్డులను ఉపయోగించి దర్శన టికెట్లు, గదులు పొందుతున్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ప్రస్తుతం టీటీడీ వద్ద ఉన్న వ్యవస్థలో భక్తుడు సమర్పించిన ఆధార్ కార్డు అసలైనదా కాదా అని తక్షణమే నిర్ధారించే సాంకేతికత అందుబాటులో లేదు. దీనిని ఆసరాగా చేసుకుని దళారులు భక్తులను మోసం చేస్తున్నారు.

ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సేవలను వినియోగించుకోవాలని టీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇటీవల యూఐడీఏఐ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఏయూఏ (AUA) రిజిస్ట్రేషన్: టీటీడీని ‘అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ’గా నమోదు చేసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం రెండేళ్ల కాలపరిమితికి గాను రూ. 20 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ నిర్ధారణ కోసం జరిగే ప్రతి లావాదేవీకి 4 పైసలు, పూర్తి స్థాయి ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ కోసం ఒక్కొక్కరికి రూ. 3.40 చొప్పున టీటీడీ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు టీటీడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆధార్ నిర్ధారణతో పాటు, టీటీడీ ఇప్పటికే ‘ఫేస్ రికగ్నిషన్’ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. భక్తులు దర్శనం చేసుకునే సమయంలో లేదా లడ్డూలు పొందే సమయంలో వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా, వారు అదే రోజున మళ్లీ దర్శనానికి వస్తున్నారా లేదా అనే విషయాన్ని సిస్టమ్ గుర్తిస్తుంది. దీనివల్ల ఒకే టికెట్‌పై ఎక్కువ మంది దర్శనం చేసుకోవడం లేదా టోకెన్ల దుర్వినియోగం కావడం వంటివి తగ్గుతాయి.

భక్తులకు కలిగే ప్రయోజనాలు: గదుల కేటాయింపు లక్కీ డిప్‌లో సామాన్య భక్తులకు సమాన అవకాశాలు లభిస్తాయి. నకిలీ గుర్తింపు కార్డులతో మోసాలు చేసే మధ్యవర్తుల ఆటలు సాగవు. ఆధార్ నిర్ధారణ ఆన్‌లైన్ ద్వారా తక్షణమే జరగడం వల్ల కౌంటర్ల వద్ద వేచి ఉండే సమయం తగ్గుతుంది. అపరిచిత వ్యక్తులు నకిలీ కార్డులతో తిరుమల కొండపైకి ప్రవేశించకుండా భద్రతను పటిష్టం చేయవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *