Last Updated:
వాడపల్లి Venkateswara Swamy ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రథోత్సవం సహా ప్రత్యేక కార్యక్రమాలతో కోనసీమ తిరుపతి సందడి.
ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో (Vadapalli Venkateswara Swamy) వార్షిక కళ్యాణ మహోత్సవాలు అద్భుతంగా ప్రారంభమయ్యాయి. దశమి రోజు నుంచి మొదలైన ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా కొనసాగనున్నాయి. ఇప్పటికే తొలి రోజే రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనంతో క్షేత్రం భక్తి సంద్రంగా మారింది. స్థిరవారం కావడంతో ప్రతి రోజు వేలాది కాదు, లక్షలాది మంది భక్తులు స్వామివారి కృప కోసం తరలివస్తున్నారు.
వైకుంఠనాథుడైన వెంటకటేశ్వర స్వామి (Venkateswara Swamy) చందన రూపంలో దర్శనమిచ్చే ఈ దివ్యక్షేత్రం కోనసీమ తిరుపతిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ స్వామివారి దర్శనం పొందేందుకు సాధారణ రోజుల్లోనే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. పర్వదినాల్లో అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక నమ్మకం ఈ క్షేత్రాన్ని మరింత మహిమాన్వితంగా నిలబెడుతోంది.
మహోత్సవాల్లో భాగంగా మార్చి 29న స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే 28న ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రథోత్సవం సహా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏప్రిల్ 3 వరకు భక్తులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది.
మరోవైపు వాడపల్లి గ్రామం మొత్తం విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా మెరిసిపోతోంది. ఆలయాన్ని చుట్టుముట్టిన ప్రదేశాల్లో రంగురంగుల లైటింగ్ ఏర్పాటు చేసి, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొంటూ భక్తి పరవశంలో మునిగిపోతున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రసాదాల పంపిణీ నుంచి తాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఎండాకాలం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేసి, భక్తులు సులభంగా దర్శనం పొందేలా చర్యలు చేపట్టారు. లోకక్షేమం కోసం నిర్వహిస్తున్న ఈ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం అధికారులు పిలుపునిచ్చారు. విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మికత కలిసిన ఈ మహోత్సవం వాడపల్లి క్షేత్రాన్ని మరింత వైభవంగా నిలబెడుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


