పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎడ్ల బండి పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలు గ్రామీణ సంస్కృతికి ఊపిరి పోశాయి. చేబ్రోలు గ్రామంలోని పొలాల్లో, రోడ్లపై ఎడ్ల గిత్తలు పోటీ పడడంతో పండుగ వాతావరణం నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా సీనియర్స్, జూనియర్స్ విభాగాల నుండి 42 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ పోటీలు సాయంత్రం ముగిశాయి. సీనియర్ విభాగంలో గుమ్ములేరు ప్రాంతానికి చెందిన ఎడ్ల జత విజయం సాధించగా, జూనియర్ విభాగంలో కాపవరం ప్రాంత ఎడ్లు గెలుపొందాయి. వన్నెపూడి ప్రాంతానికి చెందిన ఎడ్ల జత రెండవ స్థానంలో నిలిచింది.
జనసేన నాయకులు పెండెం దొరబాబు, ఊదోరి కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విజేతలకు నగదు బహుమతులు, ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. గోదావరి జిల్లాల్లో ఎడ్ల బండి పోటీలు సాంప్రదాయ క్రీడగా కొనసాగుతున్నాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం యువతలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు గ్రామీణ సంస్కృతిని పరిరక్షించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ పోటీలను పెద్ద సంఖ్యలో ఆస్వాదించారు.


