Last Updated:
అంబేద్కర్ కోనసీమ అంతర్వేది పల్లెపాలెం వద్ద మత్స్యకారుల వలలో అరుదైన కిచిడి చేపలు రెండు చిక్కి, ఒక్కోటి 35 కిలోలు, రూ 1.5 లక్షలకు అమ్ముడై సంచలనం.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల జీవితంలో అదృష్టం ఎప్పుడు ఎలా తిరుగుతుందో చెప్పలేం. కొన్ని రోజులు వల వేసినా ఒక్క చేప కూడా దొరకక నిరాశ మిగులుతుంటే, మరికొన్ని రోజులు మాత్రం ఒక్కసారిగా అదృష్టం తలుపుతట్టుతుంది. తాజాగా కోనసీమ సముద్రతీరంలో అలాంటి అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా కనిపించే చేపలా ఉన్నా, అది మత్స్యకారులకు లక్షల్లో ఆదాయం తీసుకువచ్చి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపింది.
ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లెపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు రెండు అరుదైన కిచిడి చేపలు వలలో చిక్కాయి. చూడటానికి భారీగా ఉన్న ఈ చేపలు సాధారణంగా తినడానికి ఉపయోగపడవు. కానీ వీటికి ఉన్న ప్రత్యేకత మాత్రం వేరే. వైద్య రంగంలో ఉపయోగపడే లక్షణాలు ఉండటంతో ఈ చేపలకు భారీ డిమాండ్ ఉంటుంది.
వలలో చిక్కిన ఈ చేపలను మత్స్యకారులు కష్టపడి ఒడ్డుకు తీసుకురాగానే, వాటిని గుర్తించిన మధ్యవర్తులు వెంటనే కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. వేలం పాటలో 35 కిలోల బరువు ఉన్న ఒక్కో చేప రూ.1.5 లక్షల వరకు ధర పలికింది. రెండు చేపలతోనే లక్షల్లో ఆదాయం రావడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఈ కిచిడి చేపల ప్రత్యేకత ఏమిటంటే, వీటిలో ఉన్న కొన్ని భాగాలు వైద్య చికిత్సల్లో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శస్త్రచికిత్సలకు సంబంధించిన పరిశోధనల్లో ఈ చేప భాగాలు ఉపయోగపడుతాయని అంటున్నారు. అందుకే ఇవి మార్కెట్లో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. మధ్యవర్తులు ఈ చేపలను ఇతర ప్రాంతాలకు తరలించి మరింత ధరకు విక్రయించే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.
ఇంకా విశేషం ఏమిటంటే, మత్స్యకారులకు దొరికిన ఈ చేపలు ఆడ చేపలని, మగ చేపలు దొరికితే ధర ఇంకా రెట్టింపు అయ్యేదని వారు చెబుతున్నారు. ఏదేమైనా, ఒక్కరోజు వేటతోనే లక్షల్లో ఆదాయం రావడం మత్స్యకారులకు అరుదైన అదృష్టంగా మారింది. కోనసీమ తీరంలో దొరికిన ఈ కిచిడి చేపలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


