విశాఖలో గ్యాస్ కొరత.. బిర్యానీ సెంటర్లకు భారీ దెబ్బ.. హోటళ్లు మూతపడే పరిస్థితి..! Gas shortage in Visakhapatnam impacts hotels fear of closure | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖపట్నంలో గ్యాస్ కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బిర్యానీ సెంటర్లు గ్యాస్ సరఫరా తగ్గడంతో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. స్విగ్గీ, జొమాటో సేవలు కూడా పరిమితం అయ్యాయి.

+

గ్యాస్

గ్యాస్ కొరత కారణంగా మరికొద్ది రోజుల్లో మూతపడనున్న హొటళ్లు..

విశాఖపట్నంలో గ్యాస్ కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో నగరంలోని అనేక హోటళ్లు, ముఖ్యంగా బిర్యానీ సెంటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే డిమాండ్‌కు తగ్గట్టు వంటలు చేయలేకపోతున్నామని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో హోటళ్లు మూతపడే పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ఈ సమస్యకు కారణమయ్యాయని నిర్వాహకులు అంటున్నారు. ముఖ్యంగా ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం గ్యాస్ సరఫరాపై పడుతోందని చెబుతున్నారు. ఈ ప్రభావం దేశంలోని అనేక ప్రాంతాల మాదిరిగానే విశాఖపట్నం నగరంపై కూడా పడింది. గ్యాస్ కొరత కారణంగా హోటల్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఇప్పటివరకు రోజుకు భారీ స్థాయిలో వంటలు చేసిన హోటళ్లు ఇప్పుడు తమ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఒక పూటకు 40 నుంచి 60 కిలోల వరకు బిర్యానీ వండిన హోటళ్లు ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా ఆ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించాయి. ముఖ్యంగా బిర్యానీ సెంటర్లు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి.

విశాఖలోని ప్రముఖ అభిరుచి హోటల్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో రోజుకు సుమారు 40 కిలోల వరకు మటన్, చికెన్, ప్రాన్స్ బిర్యానీలు తయారు చేసేవారని చెప్పారు. దాదాపు వంద రకాల బిర్యానీలు అందుబాటులో ఉండేవని తెలిపారు. అయితే ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా రోజుకు కేవలం 20 నుంచి 30 కిలోల వరకు మాత్రమే బిర్యానీ తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నామని వెల్లడించారు.

అదేవిధంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలైన స్విగ్గీ, జొమాటోకు కూడా సరఫరాను తగ్గించాల్సి వచ్చిందని చెప్పారు. గతంలో రోజంతా టేక్ అవే, డైనింగ్ సేవలు అందించినప్పటికీ ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే పరిమితం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కువ సమయం పట్టే మటన్ బిర్యానీ తయారీని కూడా తగ్గించామని, అలాగే గ్యాస్ ఎక్కువగా వినియోగించే స్టార్టర్లు, ఇతర వంటకాలను కూడా తగ్గించాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

ఇక గ్యాస్ సిలిండర్ల సరఫరా కూడా భారీగా తగ్గిందని హోటల్ యజమానులు చెబుతున్నారు. గతంలో రోజుకు నాలుగు నుంచి ఐదు కమర్షియల్ సిలిండర్లు అవసరమయ్యేవని, ప్రస్తుతం మాత్రం ఒకటి లేదా రెండు సిలిండర్లు మాత్రమే అందుతున్నాయని వివరించారు. అది కూడా చాలా కష్టపడి తెప్పించుకోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లను నడపడం కష్టమవుతుందని, అవసరమైతే మూసివేయాల్సి కూడా రావచ్చని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. నగరంలో గ్యాస్ కొరత సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే హోటల్ రంగం మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *