Last Updated:
విశాఖలో గ్రీన్ క్లైమేట్ టీం జెవి రత్నం ఆధ్వర్యంలో పశుపక్ష్యాదుల దాహం తీర్చేందుకు మట్టి పాత్రల్లో నీరు, చిరుధాన్యాలు అందుబాటులో ఉంచే కార్యక్రమం ప్రారంభమైంది.
వేసవికాలం ప్రారంభమయ్యే సరికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో పశుపక్ష్యాదుల దాహం తీర్చేందుకు విశాఖలో ఓ హృదయాన్ని హత్తుకునే కార్యక్రమం ప్రారంభమైంది. సమస్త జీవరాశిని కాపాడుకుందాం అనే సంకల్పంతో గ్రీన్ క్లైమేట్ టీం స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచాలని పిలుపునిస్తున్నారు.
విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఉన్న ఆళ్వార్ దాస్ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ అధ్యక్షతన మట్టి పాత్రల్లో నీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జెవి రత్నం, ఈ ఏడాది కనీసం 20 వేల మట్టి పాత్రలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. విశాఖలో ప్రతి ఇంటి ముందూ ఒక నీటి పాత్ర ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
పక్షుల కోసం కేవలం నీరే కాదు, చిరుధాన్యాలు కూడా అందుబాటులో ఉంచాలని కోరారు. అడవులు, కొండలు, తీర ప్రాంతాల్లో వర్షాకాలంలో చిరుధాన్యాలు చల్లి పక్షులకు ఆహారం అందించే ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, కొంతమందికి ఇంటి వద్ద పక్షులకు నీళ్లు పెట్టేందుకు మట్టి ప్రమిదలను ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు.
వేసవిలో నీటి కోసం అడవుల నుంచి బయటకు వచ్చే వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జెవి రత్నం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అలాగే జిల్లా అధికారులు స్పందించి పశుపక్ష్యాదులకు తగిన నీటి వసతులు కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మ్యాంగో మేన్ అప్పాజీ, స్వాంతన సేవా సంస్థ ప్రతినిధి ప్రజ్ఞాన్ కుమార్, గ్రీన్ క్లైమేట్ టీం వాలంటీర్ జె రాజేశ్వరి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు. “ఒక్క గిన్నె నీరు ఒక ప్రాణాన్ని కాపాడుతుంది” అనే భావంతో ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో పక్షులు, జంతువులను రక్షించేందుకు ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


