Last Updated:
Kakinada Fire Accident: వేట్లపాలెంలో పేలుడు ఘటనలో 21 మంది మృతిచెందారు. సీఎం చంద్రబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించారు.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ఆయనకు ఈ దారుణ ఘటనపై సమాచారం అందగానే హుటాహుటిన అక్కడి నుంచి నేరుగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైన బాణసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం నేరుగా కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 21 మంది మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక పరిహారం ప్రకటించారు. ఘటనకు గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద బాధిత కుటుంబాలను సామర్లకోట ఆసుపత్రి వద్ద పరామర్శించిన ముఖ్యమంత్రి. శోకసంద్రంలో ఉన్న మృతుల కుటుంబాలను పరామర్శించిన సీఎం చంద్రబాబు గారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి. pic.twitter.com/KyORTXJQm1
— D S G RAJU #YuvaGalam #iTDP (@DSGRAJU1) February 28, 2026
శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ బాణసంచా తయారీ కేంద్రంలో అత్యంత భారీ పేలుడు సంభవించింది. ఈ భీకర ఘటనలో ఏకంగా 21 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ భవనం పూర్తిగా నేలమట్టం కావడంతో పాటు, మృతుల శరీర భాగాలు ఛిద్రమై చుట్టుపక్కల పొలాల్లోకి చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో పోలీసులు డ్రోన్ల సాయంతో గాలించి ఆ మృతదేహాలను సేకరిస్తున్నారు.
ప్రమాద స్థలాన్ని చూస్తే హృదయం ద్రవించిపోయేలా ఉందని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రెస్క్యూ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధిక శాతం మంది మహిళా కార్మికులే కావడం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. నిర్వాహకుల తీవ్ర అజాగ్రత్త, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనే ఈ ఘోరానికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు నిర్ధారించారు.
ఈ దారుణ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఈ దుర్ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీ కేంద్రాలపై ఇకనుంచి కఠిన నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినా కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర హోం మంత్రి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అభాగ్యులైన మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు, ఈ దారుణ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



