Last Updated:
రాజానగరం మండలంలో కాశీవిష్ణు ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు.
సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. కంచే చేను మేసినట్లుగా, పక్కింటి పిల్లలను కన్నబిడ్డల్లా చూడాల్సిన వ్యక్తులే కామాంధులుగా మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ ఏడేళ్ల బాలికపై కామవాంఛతో దాడికి యత్నించిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు, స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలానికి చెందిన ఓ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బుధవారం సదరు బాలికకు ఆరోగ్యం బాగోకపోవడంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయింది. బాలిక తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో, జీవనోపాధి నిమిత్తం ఉదయాన్నే పనిలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది.
ఇదే గ్రామానికి చెందిన కాశీవిష్ణు (42) అనే వ్యక్తి బాధిత బాలిక ఇంటి సమీపంలోనే తన భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరిగే ఇతడు, బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. బుధవారం మధ్యాహ్నం సమయంలో బాలిక ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో చిన్నారి తలుపు తీసింది. లోపలికి ప్రవేశించిన కాశీవిష్ణు, వెంటనే తలుపులకు గడియ పెట్టి ఆ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.
నిందితుడి చర్యతో నిర్ఘాంతపోయిన బాలిక, వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. సరిగ్గా అదే సమయంలో ఏదో పని నిమిత్తం బాలిక తల్లి ఇంటికి రావడంతో, లోపల ఏదో జరుగుతోందని గ్రహించి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. ప్రమాదాన్ని పసిగట్టిన కాశీవిష్ణు భయంతో మంచం కింద దాక్కున్నాడు. అయితే స్థానికులు గదిలోకి ప్రవేశించి అతడిని బయటకు లాగి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజానగరం సీఐ ఎస్. ప్రసన్నవీరయ్య గౌడ్, ఎస్సై వై. మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, నిందితుడైన కాశీవిష్ణు కుమార్తె, బాధిత బాలిక ఇద్దరూ ఒకే తరగతిలో చదువుతున్నారు. తన కూతురి వయస్సున్న చిన్నారిపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. గురువారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి అపరిచిత లేదా తెలిసిన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” గురించి అవగాహన కల్పించాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



