శ్రీకాకుళంలో డయేరియా కలకలం.. 25 మంది ఆసుపత్రుల్లో, ఒకరి మృతి..! Diarrhea outbreak in Srikakulam 25 cases reported one dead. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)


Last Updated:

శ్రీకాకుళం మేదర వీధి, గోల్కొండ రేవు రోడ్, దమ్మల వీధి, మంగువారి తోటల్లో డయేరియా వ్యాప్తి, 25 కేసులు, సురేష్ మృతి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలన.

+

ప్రజలకు

ప్రజలకు హెచ్చరిక  పరిశుభ్రత పాటించండి, లక్షణాలు ఉంటే వెంటనే వైద్యం పొందండి

శ్రీకాకుళం పట్టణంలో గత రెండు రోజులుగా డయేరియా వ్యాధి ప్రబలడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మేదర వీధి, గోల్కొండ రేవు రోడ్, దమ్మల వీధి, మంగువారి తోట ప్రాంతాల్లో అనేక మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం సుమారు 25 కేసులు నమోదయ్యాయి. వీరిలో సురేష్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించగా ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి.

డయేరియా ప్రభావంతో బాధపడుతున్నవారిలో కొందరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. చాలామంది చికిత్సతో కోలుకుంటుండగా, మరికొందరు ఇంకా ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి నుంచే బాధితులు ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించినట్లు సమాచారం. వాంతులు, విరేచనాలు, తీవ్ర బలహీనత వంటి లక్షణాలతో బాధపడుతూ వైద్య సహాయం పొందుతున్నారు.

వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

డయేరియా వ్యాప్తికి మున్సిపల్ తాగునీరు కలుషితమై ఉండొచ్చనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు మున్సిపల్ నీటిని నేరుగా వాడవద్దని, ఇంట్లో నిల్వ ఉంచిన పాత నీటిని పారబోయాలని సూచించారు. తప్పనిసరిగా నీటిని మరిగించి వడపోసి మాత్రమే తాగాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు కూడా వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాలువలు సరిగా శుభ్రం చేయకపోవడం, తాగునీటి పైపులైన్లలో లీకేజీలు ఉండటం వల్ల కలుషిత నీరు చేరి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పైపులైన్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు ఇంటింటా సర్వే నిర్వహించి బాధితులను గుర్తించి తక్షణ వైద్యం అందిస్తున్నారు.

ప్రజలకు సహాయంగా కలెక్టరేట్‌లో 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్ 08942-229080 ఏర్పాటు చేశారు. వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. స్వీయచికిత్సకు పోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. పరిశుభ్రత పాటించడం, శుభ్రమైన ఆహారం తీసుకోవడం, నీటిని మరిగించి తాగడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా వంటి వ్యాధులను నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో పరిస్థితి నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతుండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *