Last Updated:
AP Inter Exams 2026: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్చి 24 వరకు కొనసాగే ఈ పరీక్షల కోసం మొత్తం 1,537 కేంద్రాలను సిద్ధం చేశారు.
AP Inter Exams: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్చి 24 వరకు కొనసాగే ఈ పరీక్షల కోసం మొత్తం 1,537 కేంద్రాలను సిద్ధం చేశారు. వాటిలో 45 కేంద్రాలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఈసారి మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం నుంచి 5,31,275 మంది, రెండో సంవత్సరం నుంచి 5,26,264 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతి రోజు పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. ఇవాళ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం అవ్వనున్నాయి. రేపటి నుంచి రెండో ఏడాది పరీక్షలు ప్రారంభం అవుతాయి.
విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్ చూపిన తర్వాత మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. ఇన్విజిలేటర్ అందించే ఓఎంఆర్ బార్కోడ్ షీట్లో ఉన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ధ్రువీకరించుకోవాలి. పరీక్షల పర్యవేక్షణ కోసం ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులు, బోర్డు ప్రతినిధులు వివిధ కేంద్రాలను సందర్శించనున్నారు. అదనంగా జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీలు నిర్వహిస్తాయి.
పరీక్షా కేంద్రాల్లోకి పెన్, పెన్సిల్, స్కెచ్ పెన్, ఎరేసర్, గణిత పట్టికలు మాత్రమే అనుమతిస్తారు. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా నిషేధిత వస్తువులు అనుమతించబడవు. నియమాలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటారు. పోలీసు, రెవెన్యూ, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్యం, పోస్టల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో పరీక్షలు నిరభ్యంతరంగా సాగేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి పరీక్షా గదిలో, కేంద్ర ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ బలోపేతం చేశారు.
మారిన బుక్లెట్ విధానం:
- ఈ విద్యాసంవత్సరం అమలు చేసిన మార్పుల మేరకు మొదటి సంవత్సరం గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, హిస్టరీ సబ్జెక్టులకు 32 పేజీల బుక్ లెట్ అందించనున్నారు. మిగతా సబ్జెక్టులకు 24 పేజీల బుక్లెట్ ఇవ్వబడుతుంది.
- రెండో సంవత్సరం అన్ని సబ్జెక్టులకు 24 పేజీల సమాధాన పత్రాలే అందిస్తారు. అదనపు ఆన్సర్ షీట్లు ఇవ్వబడవు కాబట్టి విద్యార్థులు సమాధానాలు జాగ్రత్తగా, పరిమిత పేజీల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అధికారులు సూచించిన నియమాలు పాటించి పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



