మాన్పూర్( బీహార్): భారతీయ మÖలాలు, సంస్కతీ సాంప్రదాయాలు ప్రత్యేకమైనవి. పర్యావరణ హితంగా ఉంటాయి. వేసుకునే దుస్తులు, వాడుక వస్తువులు, వంట సామాగ్రి, పనిముట్లు అన్నీ పర్యావరణయుతంగా ఉండేవి. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు బీహార్లోని మాన్పూర్ వాసులు. మండు వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అంతటా విస్తృతంగా వాడుతున్నా… దేశంలో చాలా ఇళ్లలో సంప్రదాయ విసనకర్రల వినియోగం ఇంకా తగ్గలేదు. తాటి ఆకులతో తయారుచేసే విసనకర్రలకు బిహార్లోని గయా సమీప మాన్పూర్ ప్రసిద్ధి. ఇక్కడున్న శివచరణ్ లేనుకు ఏకంగా ‘పంఖా గలీ’ అనే పేరుంది. ఈ వీధిలో ఉన్న చాలా కుటుంబాలకు కొన్ని దశాబ్దాలుగా ఇదే ఉపాధి మార్గం. ఒకప్ప్పుడు వేసవి సీజనులో దాదాపు 15 లక్షల విసనకర్రలను వీరు ఎగుమతి చేసేవారు. నేడు వినియోగం తగ్గి ఆ సంఖ్య 5 లక్షలకు చేరింది. మే నెలలో జరిగే ‘వట్ సావిత్రీ పూజ’ క్రతువుల్లో ఈ పంఖాలకు మంచి డిమాండు ఉంటుందని స్థానిక కార్మికుడైన అజయ్ కుమార్ తెలిపారు. రూ.12 చొప్ప్పున ధరకు అమ్మే ఈ విసనకర్రలతో సీజనులో రోజుకు రూ.800 వరకు ఆదాయం ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, యూపీ, ఒడిశా రాష్ట్రాలకు వీటిని ఎగుమతి చేస్తారు.


