విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం లో గల ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం శుక్రవారం లాకౌట్ ప్రకటించింది. ఈ లాకౌట్ మే 1వ తేదీ రాత్రి 10 గంటల నుండి అమలులోకి వస్తుందని ప్రకటనలో తెలిపింది. అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్, మెడికల్ వంటి కొన్ని ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతాయని తెలిపింది. గత ఐదు రోజులుగా పేపర్ మిల్ కాంటాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 1వ తేదీన కార్మికుల దినోత్సవం సందర్భంగా కూటమి, వైసిపి, కాంగ్రెస్ నాయకులు కార్మికుల శిబిరం వద్దకు వచ్చి సమ్మెకు సంఘీభావం తెలిపారు. రెండవ తేదీన యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యల పరిష్కరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. ఒక పక్కన యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, శుక్రవారం రాత్రి పది గంటల నుండి పర్మినెంట్ వర్కర్స్ ని కూడా లోపలకు రానివ్వకుండా, లాకౌట్ ప్రకటించి నోటీస్ అందించడం దారుణమని కార్మికులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులలో లాకౌట్ ప్రకటించిన పేపర్ మిల్ యాజమాన్యం నిరంకుశ వైఖరిని కార్మికులు తప్పు పడుతున్నారు. అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.


