విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలంటూ మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఆదోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, కమిటీ సభ్యులు రాజు, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం నాయకులు పరమేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పశ్చిమాశియాలో జరుతున్న యుద్ధాన్ని చూపి మోడీ ప్రభుత్వం ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతుందని విమర్శించారు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందన్నారు. లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీలు కట్టలేక ఆదానీ, అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేంద్రం చేసిన అప్పులను తీర్చడానికి సామాన్య ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. తక్షణమే మోడీ ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి ఈరన్న, రైతు సంఘం నాయకులు దస్తగిరి, ఉపాధ్యక్షులు హనుమంతు, నాయకులు లక్ష్మన్న, నరసింహులు, ఈరన్న, రామాంజి, నాగప్ప,చిరంజీవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


