ఆన్లైన్లో దరఖాస్తు .. కళాశాలలో ఎంపిక
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఏపీ పాలీసెట్–2026 లో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టిందని, ఈ ఏడాది నుంచి సర్టిఫికెట్ ధ్రువీకరణను పూర్తిగా ఆన్లైన్ విధానంలో హెచ్ టి టి పి ఎస్ ://పాలిసెట్. ఏపీ.జి ఓ వి. ఇన్ వెబ్సైట్లో నిర్వహించనున్నట్లు అనంతపురము ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి. జయచంద్ర రెడ్డి తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం, పారదర్శకత, సమయ పొదుపును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం , ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని, హెల్ప్లైన్ కేంద్రాలకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం జూన్ 24 నుంచి 30 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల అప్లోడ్ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 25 నుంచి జూలై 1 వరకు ఆన్లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణ నిర్వహించనున్నారు.జూన్ 29 నుంచి జూలై 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉండగా, జూలై 4న ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు. జూలై 6 న సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించనున్నారు.జూలై 7 నుంచి 10 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను స్పష్టంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు.కౌన్సెలింగ్కు సంబంధించిన తాజా సమాచారం, మార్గదర్శకాలను పాలిసెట్ అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు.


