అటువంటిదేం లేదన్న ఇరాన్
దుబాయ్: అమెరికా-ఇరాన్ చర్చలపై మరోసారి గందరగోళం తలెత్తింది. రెండు దేశాల మధ్య చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఉద్రిక్తతలు తగ్గాలని ఎదురు చూస్తున్నారు. ఎటు తిరిగినా ట్రంప్ అహంకార ధోరణి వీడడంలేదు…ఇరాన్ తన పట్టు వదలడం లేదు. ఈ నేపథ్యంలో మలివిడత సంప్రదింపులకు సంబంధించి ఇరు దేశాలు తాజాగా పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేశాయి. ఖతార్ రాజధాని దోహా వేదికగా మంగళవారం (నేడు) మరోసారి చర్చలు జరగనున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలపారు. అయితే, ఆయన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అలాంటి షెడ్యూలేమీ ఖరారు కాలేదని స్పష్టం చేసింది. ‘మా ప్రతినిధులతో తదుపరి భేటీ కోసం ఇరాన్ అధికారులు విన్నవించారు. దోహాలో మంగళవారం సమావేశం జరుగుతుంది’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ భేటీలో తమ దేశ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాల్గొంటారని శ్వేతసౌధం వెల్లడించింది. తాత్కాలిక ఒప్పందం నిబంధనలపై వాషింగ్టన్-తెహ్రాన్ మధ్య చర్చలు మంగళవారం పునఃప్రారంభమవుతాయని పాకిస్థాన్ కూడా తెలిపింది. ఈ ప్రకటనను ఇరాన్ సీనియర్ ప్రతినిధి కజెమ్ ఘరీబాబాదీ ఖండించారు. దోహాలో భేటీ ఇంకా ఖరారు కాలేదని, అవతలి పక్షంతో సాధారణ సంప్రదింపులు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, అమెరికా`ఇరాన్ మధ్య సోమవారం ఎటువంటి దాడులు జరగకపోవడం గమనార్హం. ఈ చర్చలపై రెండు దేశాల మధ్య కొంత కసరత్తు జరుగుతున్నట్లు వ్యక్తం అవుతుంది.
The post దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలు: ట్రంప్ appeared first on Visalaandhra.


